దిగొచ్చిన పసిడి ధర

– 10గ్రాముల బంగారం రూ.31,400
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌24 (జ‌నంసాక్షి) : అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ దేశీయంగా డిమాండ్‌ లేకపోవడంతో పసిడి ధర శుక్రవారం కాస్త దిగొచ్చింది. శుక్రవారం నాటి బులియన్‌ మార్కెట్లో రూ. 200 తగ్గి 10 గ్రాముల బంగారం రూ. 31,400 పలికింది. ఇక వెండి కూడా పసిడి దారిలోనే పయనించింది. కొనుగోళ్లు లేకపోవడంతో రూ. 250 తగ్గింది. దీంతో నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 37,650గా ఉంది.
అంతర్జాతీయంగా పసిడిలో పెట్టుబడులు పెరిగినప్పటికీ దేశీయంగా నగల వ్యాపారులు, రిటైలర్లు, పారిశ్రామిక వర్గాలు, నాణెళిల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడం వల్లే ఈ లోహాల ధరలు పడిపోయినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. సింగపూర్‌ మార్కెట్లో 0.61శాతం పెరిగి ఔన్సు బంగారం 1,208.20 అమెరికన్‌ డాలర్లు పలికింది. వెండి కూడా 0.78శాతం పెరిగి ఔన్సు ధర 14.25 అమెరికన్‌ డాలర్లుగా ఉంది.