దుప్పిమాంసం స్వాధీనం

 

 

 

 

ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు

మహబూబ్‌నగర్‌,జనవరి14(జ‌నంసాక్షి): జిల్లాలో బల్మూరు మండలంలో సమాచారం మేరకు ఓ ఇంటిపై దాడి చేసి దుప్పిమాంసను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు అచ్చంపేట అటవీశాఖ అధికారి (ఎఫ్‌డీఓ) చంద్రయ్య తెలిపారు. డాగ్‌స్క్వాడ్‌ టీం సభ్యులు శివప్రసాద్‌, నరేష్‌లు మండలంలోని బాణాల తండాలో రమావత్‌ పార్వతమ్మ ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె ఇంట్లో ఫ్రిజ్‌లో ఉన్న కిలో దుప్పి మాంసాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పార్వతమ్మను విచారించగా తనకేవిూ తెలియదని, మాంసాన్ని శనివారం అమ్మితే తీసుకున్నానని ఆమె తెలిపినట్లు ఎఫ్‌డీఓ తెలిపారు. అదే గ్రామానికి చెందిన వారు సభావట్‌ పర్శు, కాట్రావత్‌ జాను, రమావత్‌ శ్రీను, మూడావత్‌ శివలు వన్యప్రాణులను వేటాడుతున్నట్లు తమ విచారణ ద్వారా తెలుసుకున్నామని, వీరిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 సెక్షన్‌09 ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నలుగురు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని పట్టుకుంటామని ఎఫ్‌డీవో తెలిపారు.