ధరణి నమోదుకు డెడ్లైన్లేదు
– కోర్టుకు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్,అక్టోబరు 21(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ధరణి వెబ్సైట్లో ఆస్తుల నమోదు ప్రక్రియపై న్యాయవాది గోపాల్ శర్మ దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. చట్టబద్దత లేకుండానే వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది .. ఆధార్, కులం వంటి వివరాలు అడుగుతున్నారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. వెబ్సైట్ ద్వారా వివరాలు అందరికీ అందుబాటులో ఉంటాయని, 15 రోజుల్లో వివరాలు నమోదు చేయాలని అంటున్నారని తెలిపారు. దీనిపై జోక్యం చేసుకున్న న్యాయస్థానం… సేకరించిన వివరాలు రహస్యంగా ఉంచితే తప్పేంటని ప్రశ్నించింది. ధరణి వెబ్సైట్లో ఆస్తుల నమోదుకు గడువు లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఆస్తుల నమోదుకు చివరితేదీ లేదన్న ఏజీ వివరణను నమోదు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఆ విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకొని చెప్పాలని ఏజీకి సూచించిన హైకోర్టు .. ఆస్తుల నమోదుపై విచారణను మధ్యాహ్నం 1.30కి వాయిదా వేసింది.