ధరణి పోర్టల్‌ లోపాల పుట్ట

తప్పులు సరిదిద్దడంలో కెసిఆర్‌ విఫలం
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నేతల విమర్శలు
హైదరాబాద్‌,సెప్టెంబర్‌25 (జనంసాక్షి)  ధరణి పోర్టల్‌ అంతా లోపాలతో నిండిపోయిందని, దీని వల్ల ప్రజలకు కొత్త కష్టాలు వచ్చాయి తప్ప సమస్యలు తీరలేదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అన్ని రంగాలపై తనకు అనుభవం ఉందనే సీఎం కేసీఆర్‌.. మరి ధరణి పోర్టల్‌ సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదో చెప్పాలన్నారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లోధరణి పోర్టల్‌, భూ సమస్యల పరిష్కారంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ ధరణి పోర్టల్‌ వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. ధరణి పోర్టల్‌లో చాలా సమస్యలు ఉన్నాయని, నెలల తరబడి రైతులు రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ధరణి పోర్టల్‌పై అనేక అనుమానాలు ఉన్నాయని మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దామోదర రాజనర్సింహ అన్నారు. 50ఏళ్లుగా అనుభవిస్తున్న భూములపై రైతులకు ఇప్పుడు హక్కు లేదంటున్నారని మండిపడ్డారు. ధరణి వచ్చాక అన్నదమ్ములు కొట్లాడుకోవాల్సి వస్తోందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ప్రజల భూమిని లాక్కుని ప్రైవేట్‌ కార్పొరేట్‌ కంపెనీలకు అప్పజెప్పుతున్నారని ఆమె మండిపడ్డారు.