ధర్నాచౌక్‌ను పునరుద్దరిస్తూ.. హైకోర్టు ఆదేశాలు


– మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన కోర్టు
– తెలంగాణ ప్రభుత్వం, పోలీసులకు నోటీసులు
హైదరాబాద్‌, నవంబర్‌13(జ‌నంసాక్షి) : ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌ లోని ఇందిరాపార్క్‌ వద్ద ఉన్న ధర్నా చౌక్‌ ఎత్తివేత నిర్ణయాన్ని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్వర్వులు జారీచేసింది. ఆరు వారాల పాటు ఈ తీర్పు అమల్లో ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. నగరం మధ్యలో ధర్నా చౌక్‌ ఉండటంతో తమకు ఇబ్బంది కలుగుతోందనీ, పిల్లలను పాఠశాలలకు పంపలేకపోతున్నామని పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ధర్నాచౌక్‌ ను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ ప్రాంతంలో ఆందోళనలపై పోలీసులు నిషేధాన్ని విధించారు. నగరానికి దూరంగా ఉన్నచోట ఆందోళనలు నిర్వహించుకోవాలని సూచించారు. దీంతో పలు ప్రజాసంఘాలు, పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అప్పటి అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ప్రజల భద్రత కోసమే ధర్నా చౌక్‌ ను ఎత్తివేశామని తెలిపారు. ధర్నా చౌక్‌ కారణంగా స్థానికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందనీ, ట్రాఫిక్‌ భారీగా స్తంభిస్తోందని వెల్లడించారు. అయితే ఈ వాదనలను పిటిషనర్లు ఖండించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది. తాజాగా మంగళవారం మరోసారి పిటిషన్‌ ను విచారించిన న్యాయస్థానం ధర్నాచౌక్‌ ను పునరుద్ధరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆదేశాలు ఆరువారాల పాటు చెల్లుబాటు అవుతాయని వెల్లడించింది. ఈ విషయంలో తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వంతో పాటు పోలీసులకు నోటీసులు జారీచేసింది.