ధాటిగా ఆడుతున్న భారత్‌ ఓపెనర్లు

అర్థశతకాలతో రాణించిన రాహుల్‌, రోహిత్‌

విశాఖపట్టణం,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్లు బ్యాటింగ్‌తో అలరిస్తున్నారు. పటిష్ఠ విండీస్‌ బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొంటూ జట్టుకు మంచి శుభారంభం అందించారు. ఈ క్రమంలోనే ఓపెనింగ్‌ జోడీ అర్ధశతకాలు పూర్తి చేసుకుంది. మొదటి నుంచి కాస్త వేగంగా ఆడుతున్న కేఎల్‌ రాహుల్‌ 46 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతనికిది ఐదోవది కావడం విశేషం. అనంతరం హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ 67 బంతుల్లో 50 మార్క్‌ అందుకున్నాడు. వన్డేల్లో రోహిత్‌ 43వ హాఫ్‌సెంచరీ బాదడం విశేషం. క్రీజులో కుదురుకున్న ఓపెనింగ్‌ ద్వయం రన్‌రేట్‌ తగ్గకుండా ఉండేందుకు దూకుడు పెంచింది. తొలుత టాస్‌ గెలిచిన విండీస్‌ ఫీల్డింగ్‌ తీసుకుంది. దీంతో భారత్‌ బ్యాటింగ్‌ చేపట్టింది. మంచి భాగస్వామ్యం నెలకొల్పిన జోడీని విడదీసేందకు కరీబియన్‌ బౌలర్లు శ్రమిస్తున్నారు. డ్రింక్స్‌ బ్రేక్‌ అనంతరం రెండు ఓవర్లలో భారత్‌ కేవలం రెండే పరుగులు రాబట్టింది. జేసన్‌ ¬ల్డర్‌, అల్జారీ జోసెఫ్‌ కట్టుదిట్టంగా బంతులేశారు. పరుగులు చేయకుండా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంతో పాటు వికెట్‌ పడగొట్టాలని ప్రత్యర్థి బౌలర్లు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం 23 ఓవర్లు ఆడిన భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 127 పరుగులు చేసింది. రోహిత్‌(55), రాహుల్‌(69) క్రీజులో ఉన్నారు.