ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు

వరంగల్‌,మే7(జ‌నంసాక్షి):  జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో గోదాములు ఉన్నా వాటిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే గోధుమలు నింపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కాజీపేట భారత ఆహార సంస్థ గిడ్డంగులను ఉన్నతాధికారులు గోధుమలతో నింపే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో పండే బియ్యంను పక్కన పెట్టి ఎక్కడి నుంచో వచ్చిన గోధుమలకు అవకాశం ఇవ్వడం వల్ల స్థానిక రైతులు ఆందోలన చెందుతన్నారు.  ఒక్కసారి గోధుములు గోదాముల్లో నిండితే కనుక అవి ఐదేళ్ల వరకు నిల్వ ఉంటాయి. అప్పుడు బియ్యంను నిల్వ చేసేందుకు స్థలం లేకుండాపోతుంది. గతవారం కాజీపేట గోదాములు ఉడుకబెట్టిన బియ్యం రాకపోవడంతో ఖాళీగా ఉన్నాయి. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే గోధుమలతో నింపాలని ఆదేశించారు.  గోధుమలతో గోదాములు నిండిపోతే బియ్యంను ప్రైవేటు గోదాములకు తరలించాల్సి వస్తుంది. పైగా స్థానికంగా ఉన్న హమాలీలకు పనిదొరకదు.  గోధుమలను ఇక్కడికి తరలించేందుకు కుట్ర పన్నుతున్నారని, దీనిని తాము

వ్యతిరేకిస్తున్నామని వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు తెలిపారు. ఈ చర్యపై ఇప్పటికే అధికారులను కలిసి వినతిపత్రం కూడా సమర్పించారు.