ధాన్యం కొనుగోళ్లకు పక్కాగా ఏర్పాట్లు

మద్దతు ధరలకే అమ్ముకోవాలన్న ఎమ్మెల్యే
జనగామ,నవంబర్‌4 (జనంసాక్షి) : రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని స్టేషన్‌ఘన్‌ఫూర్‌ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ధాన్య కొనుగోళ్లకు ఎక్కడిక్కడ ఏర్పాట్లు చేశామని అన్నారు. రైతులు నిర్భయంగా తమ పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకోవాలన్నారు. నియోజకవర్గంలో 13 ఐకేపీ కేంద్రాలున్నాయని, అవసరాలను బట్టి మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గతేడాది తెలంగాణలో వ్యవసాయ సీజన్‌లో ఐకేపీ, పౌరసరఫరాల శాఖ నుంచి రైతులు నుంచి అంచనాలకు మించి ధాన్యాన్ని కోనుగోలు చేసి రికార్డు సృష్టించిందన్నారు. జాతీయస్థాయిలో పంజాబ్‌ తర్వాత తెలంగాణ రాష్ట్రం కొనుగోలు కేంద్రాల్లో రెండో స్థానంలో ఉందన్నారు. వర్షంతో నష్టపోయిన పంటల వివరాలు అధికారులు సేకరిస్తున్నారని, రైతులు ఆందోళన చెందొద్దన్నారు. పంట నష్టపరిహారం అందించేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
ఇదిలావుంటే  బాల్య వివాహాలను అరికట్టేందుకు మహిళా సంఘాలు, అంగన్‌వాడీలు, స్వచ్చంధ సంస్థలు గ్రామాల్లో అవగాహన కల్పించాలని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలనే సంకల్పంతో జిల్లాలో ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. అవసరమైన  గన్నీ బ్యాగులను సహకార సంఘాలకు సరఫరా చేసినట్లు తెలిపారు. రైతుల నుంచి తూకం వేసిన ధాన్యం బస్తాలను ఎప్పటికప్పుడు రైస్‌మిల్లులకు తరలించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌ రైతులకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని జేసీని ఆదేశించారు.