ధాన్యాన్ని అమ్ముకున్న గోడౌన్ యజమాని…

ఆత్మకూరు: గోడౌన్‌లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని అమ్ముకోవడమే కాక ఆ రైతులపైనే గోడౌన్ యజమాని దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఆత్మకూరులోని కేస్టార్ గోడౌన్‌లో కొందరు రైతులు ధాన్యం భద్రపరుచుకున్నారు. అయితే గోడౌన్ యాజమాని అన్వర్ రైతులకు తెలియకుండా ధాన్యాన్ని అమ్ముకున్నాడు. అంతేకాదు కొందరు రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి బ్యాంకుల్లో రుణాలు పొందాడు.
మోసం బయటపడటంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. కేసు విషయమై తమ లాయర్‌ అజ్మతుల్లాతో చర్చిస్తుండగా అన్వర్ తన అనుచరులతో వచ్చి కర్రలు కత్తులతో దాడి చేశాడు. అజ్మతుల్లాను కారుతో ఢీకొట్టడంతో రెండు కాళ్లు విరిగాయి. పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని అజ్మతుల్లా ఆరోపిస్తున్నారు.