నకిలీ విలేకర్ల కోసం పోలీసుల గాలింపు

నల్లగొండ,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): ఎలక్టాన్రిక్‌ విూడియా పేర్లు చెప్పుకొని అక్రమ వసూళ్లకు పాల్పడ్డ నకిలీ విలేకరుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికే వారిపై  పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్‌ నిందితులను పట్టుకునేందుకు చర్యలు ముమ్మరం చేశారు. ఈ నెల 6న పట్టణంలోని సాగర్‌ రోడ్డులో గల ప్రశాంతి పార్‌బాయిల్డ్‌ రైస్‌మిల్లు యజమాని బ్రహ్మంకు ఫోన్‌ చేసి డైరీ ఆవిష్కరణ కోసం చందాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పలు ఎలక్టాన్రిక్‌ విూడియా చానళ్లకు చెందిన విలేకరులమంతా వచ్చామని నమ్మబలకడంతో సదరు వ్యాపారి కొంతమొత్తాన్ని ఆర్థిక సహాయంగా అందజేశాడు. అనంతరం అనుమానం కలిగిన మిల్లు యజమాని స్థానిక విలేకరులకు సమాచారం అందించారు. దీంతో విలేకరులు వచ్చిన వారిని నకిలీలుగా గుర్తించి డీఎస్పీ కార్యాలయంలో మూడు రోజుల క్రితం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రైస్‌మిల్లులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నకిలీలను గుర్తించే చర్యలు చేపట్టారు. కాగా ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీలు దృశ్యాలు సోషల్‌ విూడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఫుటేజీలు, సెల్‌ఫోన్‌ నెంబర్ల ఆధారంగా అక్రమ వసూళ్లకు పాల్పడిన నిందితులను గుర్తించినట్లుగా పోలీస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే తరహాలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.