నల్లా కనెక్షన్‌ బిల్లులు చెల్లించని.. 

ఎమ్మెల్యే బాబూమోహన్‌
– నాలుగు లక్షలు బాకీపడ్డ ఎమ్మెల్యే
– కనెక్షన్‌ కట్‌ చేసిన అధికారులు
హైదరాబాద్‌, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వ సేవలు వినియోగించుకుంటూ పన్నులు, బకాయిలు చెల్లించనివారిపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నీటి బిల్లులు చెల్లించని కమర్షియల్‌, మల్టీస్టోర్డ్‌ భవనాలు యజమానులకు పలుమార్లు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో కనెక్షన్లు తొలగించారు. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్‌కు అధికారులు శుక్రవారం ఝలక్‌ ఇచ్చారు. నల్లా కనెక్షన్‌కు సంబంధించి బకాయిలు చెల్లించనందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఆయన ఇంటికి కనెక్షన్‌ కట్‌ చేశారు. ఆయనతోపాటు దివంగత మాదాల రంగారావు తనయుడు రవి ఇంటికి కూడా కనెక్షన్‌ తొలగించారు. ఈ అంశంపై జీహెచ్‌ఎంసీ వాటర్‌ వర్క్స్‌ విభాగానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బాబు మోహన్‌ తన ఇంటికి ఉన్న నల్లా కనెక్షన్‌కు సంబంధించి రూ.4 లక్షల బకాయిలు చెల్లించలేదని, తెలిపారు. ఈ మొత్తాన్ని చెల్లించాలని అనేకసార్లు నోటీసులు పంపినా ఆయన స్పందించలేదని అన్నారు. దీంతో కనెక్షన్‌ తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. ఆలాగే బాబు మోహన్‌2తో పాటు సినీ నటుడు మాదాల రవి ఇంటికి కూడా కనెక్షన్‌ తొలగించినట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకూ నల్లా బిల్లులు రూ.3 లక్షలు దాటినా చెల్లించకపోవడంతో ఆయన నీటి సరఫరా నిలిపేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో దాదాపు 9.6 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా, బకాయిలు చెల్లించకపోవడంతో 80 వేల కనెక్షన్లు తొలగించారు. దీంతో కొందరు బకాయిలు చెల్లించి కనెక్షన్‌ తీసుకోగా, మరికొందరు పైపులను పగులగొట్టి నీటి చౌర్యానికి పాల్పడతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌, బంజారా హిల్స్‌, మాదాపూర్‌, ఫిలింనగర్‌, బేగంపేట, శ్రీనగర్‌ కాలనీలోనే అక్రమ కనెక్షన్లకు తెరతీసున్నారు. వాటర్‌ బోర్డు విజిలెన్స్‌ తనిఖీలు చేపట్టంగా కనెక్షన్లు పొందినట్టు తేలింది.