నవభారత్‌ నిర్మిస్తాం

– సర్దార్‌ సరోవర్‌ డ్యాంను ప్రారంభించిన ప్రధాని మోదీ

అహ్మదాబాద్‌,సెప్టెంబర్‌ 17,(జనంసాక్షి): దేశానికి స్వాతంత్య్రం సమకూరి 75 ఏళ్లు పూర్తయ్యే 2022 నాటికి దేశాన్ని నవభారత్‌గా మలిచేందుకు ఏ అవకాశాన్నీ జారవిడుచుకోరాదని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. ప్రతిష్టాత్మక సర్ధార్‌ సరోవర్‌ డ్యామ్‌ను ఆదివారం జాతికి అంకింత చేసిన అనంతరం గుజరాత్‌లోని దభోయ్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 125 కోట్ల ప్రజలు తనతో ఉన్నంతవరకూ తాను చిన్న వాటి గురించి ఆలోచించనని భారీ ప్రాజెక్టులతో ప్రజలకు మేలు తలపెడతానన్నారు. నీటిపారుదల, జలవనరుల గురించి నిత్యం తపించిన సర్ధార్‌ పటేల్‌, అంబేడ్కర్‌లను మనం స్మరించుకోవాలన్నారు. సర్ధార్‌ సరోవర్‌ డ్యామ్‌కు నిధులిచ్చేందుకు ప్రపంచ బ్యాంక్‌ నిరాకరిస్తే గుజరాత్‌లో సాధువులు, భక్తులు సహకరించారని, విరాళాలతో ముందుకొచ్చారని చెప్పారు.గుజరాత్‌ రాష్ట్రంలోని నర్మద జిల్లా కెవాడియాలో 1961లో అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇంతవరకు దశలవారీగా.. సుదీర్ఘ చరిత్రతో నిర్మాణం సాగింది. వాస్తవానికి ఈ అద్భుత ప్రాజెక్టును నిర్మించాలన్నది భారత తొలి ¬ం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్వప్నం. 1946లోనే ఆయన ఎంతో దూరదృష్టితో దీనిపై ఆలోచన చేశారు. నర్మద నదిపై 30 భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు రచించగా వాటిలో సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ అతిపెద్దది. డ్యామ్‌ నిర్మాణ నేపథ్యంలో పర్యావరణం, పునరావాసం తదితర అంశాలకు సంబంధించి అనేక వివాదాలూ ఉన్నాయి. చివరకు నర్మద నిర్వహణ సంస్థ తుది ఎత్తును ఖరారు చేసింది. ఈమేరకు ఈ ఏడాది జూన్‌ 17న డ్యామ్‌ గేట్లు మూసివేసి.. ఎత్తును 121.92 విూటర్ల నుంచి 138.68 విూటర్లకు పెంచారు. దీంతో నీటి నిల్వ సామర్ధ్యం 4.73 మిలియన్‌ ఎకరపు అడుగులకు పెరిగింది. ఎత్తు పెంచిన డ్యామ్‌నే ప్రధాని మోదీ ప్రారంభించారు.వినియోగించిన కాంక్రీట్‌ పరిమాణం పరంగా చూస్తే సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ ప్రపంచంలోనే రెండో పెద్ద ప్రాజెక్టు. అమెరికాలోని గ్రాండ్‌ కౌలీ డ్యామ్‌ తర్వాత అత్యంత ఎక్కువ కాంక్రీట్‌ వినియోగించింది దీనికే. గ్రాండ్‌ కౌలీకి 8 మిలియన్‌ క్యూబిక్‌ విూటర్ల కాంక్రీట్‌ను వాడితే.. సరోవర్‌ డ్యామ్‌కు 6.82 మిలియన్‌ క్యూ.విూ.లు వినియోగించారు. ఈ కాంక్రీట్‌తో భూమధ్యరేఖకు ఇరువైపులా రోడ్లను నిర్మించవచ్చన్నది ఒక అంచనా.భారీగా విద్యుదుత్పత్తి..

ఇప్పటికే విద్యుదుత్పత్తి కొనసాగుతుండగా.. తాజా అంచనాల ప్రకారం ఏటా 100 కోట్ల యూనిట్ల జల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం రోజుకు 1450 మెగావాట్ల విద్యుత్తు తయారయ్యే సామర్ధ్యానికి నిర్మాణం పూర్తయింది. డ్యామ్‌ పరిధిలో రెండు విద్యుదుత్పత్తి కేంద్రాలు పనిచేస్తున్నాయి. నదీ గర్భానికి అనుసంధానంగా ఒకటి, కాలువ ప్రారంభంలో మరొకటి ఉన్న వీటిద్వారా ఇంతవరకు 4,141 కోట్ల యూనిట్ల విద్యుదుత్పత్తి అయింది. వీటి సామర్ధ్యం వరుసగా 1200, 250 మెగావాట్లు. వీటిద్వారా ఇంతవరకు రూ. 16 వేల కోట్ల ఆదాయం సమకూరడం విశేషం. ఇక్కడ తయారయ్యే విద్యుత్తును మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌లు 57 : 27 : 16 నిష్పత్తిలో పంచుకుంటాయి.

ప్రాజెక్టు ఆకృతి..

సరోవర్‌ డ్యామ్‌ పొడవు 1.2 కిలో విూటర్లు. జలాశయం లోతు 163 విూటర్లు. దాదాపు 30 గేట్లున్న సాగర్‌ సరోవర్‌ డ్యామ్‌లో ఒక్కో గేటు బరువు 450 టన్నులకు పైగా ఉంటుంది. ఒక గేటు మూయాలంటే గంట పడుతుంది.

పది లక్షల మంది రైతులకు ప్రయోజనం

డ్యామ్‌ ఎత్తు పెంచడంతో నీటినిల్వ సామర్ధ్యం పెరిగి గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలు అత్యంత ప్రయోజనం పొందనున్నాయి. మొత్తంగా సాగునీటిని అందించడం ద్వారా పది లక్షల మంది రైతులకు.. అనేక గ్రామాలు, పట్టణాలకు తాగునీరు అందడం ద్వారా 4 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు ద్వారా నర్మద నదీ జలాలను గుజరాత్‌లో తీవ్ర నీటిఎద్దడి ఉన్న ప్రాంతాలకు కాలువలు, పైపులైన్లతో పంపిస్తారు. 18,144 గ్రామాలకు తాగునీరందిస్తారు. దాదాపు 18 లక్షల హెక్టార్లు సాగులోకి వస్తాయి. రాజస్థాన్‌లోని ఎడారి జిల్లాలైన బార్మెర్‌, జలోర్‌లు సహా మొత్తం 2.46 లక్షల హెక్టార్లకు సాగునీరందనుంది. మహారాష్ట్రలో 37,500 హెక్టార్లకు నీరందుతుంది. ఇక్కడ 9,633 గ్రామాలు, 131 పట్టణ ప్రాంతాలకు తాగునీటిని ప్రత్యేకంగా కేటాయించారు.