నాలుగున్నరేళ్లుగా మాయమాటలతో మభ్యపెట్టారు

టీఆర్‌ఎస్‌ నేతలు ఇచ్చిన ఏ హావిూని నెరవేర్చలేదు
ఉమ్మడి జిల్లాలో 14సీట్లను గెలుస్తాం: సంపత్‌
మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌11(జ‌నంసాక్షి):  నాలుగున్నరేళ్లుగా తెలంగాణ ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టారని,  ఏ ఒక్క పనిని నీతి, నిజాయితీతో చేసిన దాఖలాలు లేవని కాంగ్రెస్‌ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ అన్నారు. ముఖ్యంగా పాలమూరు ప్రాంతాన్ని పూర్తిగా వంచించారని దుయ్యబట్టారు. దళితుల మూడెకరాల భూమి, మైనార్టీలు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, బోయలను ఎస్టీలలో చేర్చడం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇంటింటికీ తాగునీరు… ఇలా చెప్పుకుంటూ పోతే గత ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ నేతలు ఇచ్చిన ఏ హావిూని నెరవేర్చలేదు. దీంతో కేసీఆర్‌ విూద కసి తీర్చుకోవడానికి ఓటు అనే ఆయుధాన్ని వాడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు.  కాంగ్రెస్‌ హయాంలో 90శాతం పూర్తయిన ప్రాజెక్టులకు మిగతా పది శాతం నిధులను కేటాయించలేని దద్ధమ్మ ప్రభుత్వం కేసీఆర్‌ది. కవిూషన్లకు కక్కుర్తిపడి చేపట్టిన మిషన్‌ భగీరథ పనుల్లో నాణ్యత లేమి కారణంగా ఎక్కడిక్కడ లీకేజీలు ఏర్పడుతున్నాయన్నారు.  టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతనే ఉండదు. ప్రతీ పనిలోనూ పాలనా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పరిపాలన చేత కాకపోవడంతోనే మధ్యలో పారిపోయారు. పరిపాలన చేత కాక, తాగునీళ్లు అందించలేని టీఆర్‌ఎస్‌ నేతలకు ఓట్లడిగే హక్కు ఎక్కడిదని ఆయన  ప్రశ్నించారు. ప్రజలెప్పుడూ ధర్మం, న్యాయం వైపే నిలుస్తారు. ఆ నమ్మకం ఉన్నందునే చెబుతున్నా… ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్నీ అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకోబోతుందన్నారు.  ఈ విషయం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు కూడా తెలుసు. వారు ఎన్ని జిమ్మిక్కులు చేసిన పాలమూరు జనం నమ్మే పరిస్థితి లేదన్నారు.  కేసీఆర్‌ చేయించిన సర్వేలన్నింటల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీనే బలంగా ఉందని, ముఖ్యంగా పాలమూరులో హస్తం స్వీప్‌ చేయబోతుందని తేలిందన్నారు. . మేం చేయించిన సర్వేల్లో కూడా ఇదే అంశం స్పష్టమైందన్నారు.
టీఆర్‌ఎస్‌ అరాచకాలకు భరించడానికి ప్రజలు సిద్ధంగా లేదరన్నారు. . ఇప్పటికే ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల మయం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు క్లీన్‌ స్వీప్‌ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి పాలమూరు గురించి చెబుతున్నరు.  పాలమూరుకు విూరు ఒరగబెట్టిందేమిటో గుండె విూద చెయ్యి వేసుకుని చెప్పాలి. కాంగ్రెస్‌ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ వంటి ప్రాజెక్టుల పనులను 90శాతం పూర్తి చేశామన్నారు. కావాలంటే ఏయే ప్రాజెక్టులపై ఎవరి హయాంలో ఎంత ఖర్చు చేశారు.. ఏ మేర పనులు జరిగాయేది అధికారులను అడగండి. ఇది వరకే పలుమార్లు ప్రాజెక్టులకు ఎవరి హయాంలోనే నిధులు ఖర్చు చేసిందనేది బయటపెట్టాం. పెండింగ్‌లో ఉన్న పది శాతం పనులు కూడా పూర్తి చేయడానికి టీఆర్‌ఎస్‌ నాయకులకు చేతకాలేదన్నారు.
ప్రాజెక్టుల విూద కాంగ్రెస్‌ నేతలు కేసులు వేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా సీఎం ¬దాలో కేసీఆర్‌ ఇచ్చిన మాటను తప్పారని నఅ/-నారు. ముంపు బాధితులందరికీ ప్రభుత్వ ఉద్యోగం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తానని చెప్పి మాట తప్పలేదా? దీనిపై టీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు మాట్లాడరు. పరిపాలన చేతకాక అన్నీ అడ్డదిడ్డమైన నిర్ణయాలతో ప్రజలను అవస్థలకు గురిచేస్తున్నారన్నారు. మిషన్‌ భగీరథ కేవలం వాళ్ల కవిూషన్ల కోసం తీసుకొచ్చిన పథకమే తప్ప… ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేదని సంపత్‌ కుమార్‌ అన్నారు.  ఈ పథకం కేవలం ఆంధ్రా కాంట్రాక్టర్లను బతికించడం కోసం తీసుకొచ్చిందే తప్ప మరేవిూ లేదు. వాస్తవానికి ఉమ్మడి పాలమూరు ప్రాంతంలో 16 తాగునీటి పథకాల ద్వారా ప్రజల దాహార్తి తీరుస్తున్నాం. ఉన్న తాగునీటి పథకాలను సమర్థవంతంగా అమలు చేయలేకపోయారు. తాగునీటి స్కీంల్లో పనిచేసే వారికి కూడా నెల నెల వేతనాలు అందివ్వలేని చేతకాని ప్రభుత్వం… మిషన్‌ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి నీళ్లు ఇస్తారంటే ఎవరూ నమ్మలేరు. ప్రజలకు పట్టిన టీఆర్‌ఎస్‌ పీడను విరగడ చేయడానికి ఎన్నికల్లో సమిష్టిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. అందుకు అనుగుణంగా కలిసొచ్చే పార్టీలతో కలిసి కాంగ్రెస్‌ ముందుకు సాగుతుందని వివరించారు. దీనిని తప్పు పట్టడానికి టిఆర్‌ఎస్‌కున్న అధికారం ఏంటన్నారు. ప్రస్తుతానికి అభ్యర్థుల ప్రకటన లేకపోయినా… ఎవరికి అనుకూలంగా ఉన్న చోట్ల వారు ప్రచారం కూడా చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రాగలదన్నారు.