నాలుగేళ్లలోనే 40 ఏళ్ల అభివృద్ది: కొప్పుల

జగిత్యాల,జూన్‌11(జ‌నం సాక్షి): నాలుగేళ్లలోనే నలభయ్యేళ్ల అభివృద్ధిని చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణలోని ప్లలెలు ప్రగతి పథంలో నడుస్తున్నాయని చెప్పారు. 24 గంటల నిరంతర కరెంట్‌ సరఫరాలో విజయం సాధించామని, సాగునీటి రంగంలో కూడా విజయం సాధించబోతున్నామని తెలిపారు. కాళేశ్వరంతో చరిత్ర సృష్టించబోతున్నామని అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని వెంగళాపూర్‌ గ్రామంలో కొప్పుల ఈశ్వర్‌ పర్యటించారు. రూ.11 లక్షల ఖర్చుతో నిర్మించిన మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంకును, కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతి భవనాన్ని, రెండు సీసీ రోడ్లను, కమ్యూనిటీ హాళ్ళను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కటారి చంద్రశేఖర్‌ రావు, జడ్పీటీసీ గోస్కుల శైలజ, ఎంపీపీ కాంపెల్లి సత్తెవ్వ, గ్రామ సర్పంచ్‌ అనితతో పాటు పలువురు టిఆర్‌ఎస్‌ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.