నాలుగోరోజు నిలిచిన ఆరోగ్యశ్రీ

గాంధీ,ఉస్మానియాలకు పెరిగిన తాకిడి
హైదరాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి) :  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా నాలుగో రోజూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మంత్రి ఈటెల రాజేందర్‌ చర్చలు జరిపి వారికి భరోసా ఇచ్చినా పెద్దగా ఫలితం కానరావడం లేదు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన హావిూ ఇస్తే తప్ప ఆస్పత్రులు ముందుకు వచ్చే పరిస్థితి కానరావడం లేదు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీలో భాగంగా డయాలసిస్‌ నుంచి గుండెకు స్టంట్‌ వరకు వివిధ సమస్యలకు వేలాది మంది రోగులు ఖరీదైన సేవలను ఉచితంగా పొందుతున్నారు. అయితే ప్రభుత్వం బకాయిలు విడుదల చేయడంలేదంటూ గురువారం అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైద్యసేవలు నిలిపివేశారు.గుండె, కిడ్నీ రోగులకు అత్యవసరంగా పేర్కొనే రక్తమార్పిడి పక్రియను సైతం అందించడం లేదంటూ బాధితులు వాపోతున్నారు. డిమాండ్‌లు పరిష్కరిస్తేనే సేవలు పునరుద్ధరిస్తామని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు స్పష్టం చేశాయి.సేవల నిలిపివేతతో సుదూర ప్రాంతాలు, మారుమూల జిల్లాల నుంచి నిమ్స్‌, గాంధీ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.