నా రాజకీయ జీవితంలో ఇదే అతిపెద్ద సభ

– కాంగ్రెస్‌ నేతలకు నిద్ర పట్టడం లేదు
– అన్ని వర్గాల అభివృద్ధికేసీఆర్‌ పెద్దపీట
– అందుకే సభకు ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు
– రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
– బాన్సువాడ నియోజకవర్గంలో ట్రాక్టర్‌ల ర్యాలీని ప్రారంభించిన మంత్రి
– స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ బయలుదేరిన మంత్రి
కామారెడ్డి, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ) : తన రాజకీయ జీవితంలో ఇంత పెద్ద సభను ఎప్పుడు చూడలేదని.. ఇదే అతిపెద్ద సభగా మిగిలిపోతుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. బాన్సువాడలో మంత్రి పోచారం ప్రగతి నివేదన సభకు తరలి వస్తున్న ట్రాక్టర్లను పచ్చజెండా ఊపి  ప్రారంభించారు. బాన్సువాడ నుంచి కొంగరకొలాన్‌ వరకు స్వయంగా తానే ట్రాక్టర్‌ నడుపుతానని మంత్రి పోచారం తెలిపారు. ఆదివారం ప్రగతి నివేదన సభకు 25 నుంచి 30 లక్షల మంది రాబోతున్నారని చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి 25 వేల మందికి పైగా హాజరవుతారని పేర్కొన్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల నుంచి 2లక్షల మందిని సవిూకరిస్తున్నామని వెల్లడించారు. శనివారం నియోజకవర్గం నుంచి 100కుపైగా ట్రాక్టర్లలో రైతులతో ర్యాలీగా సభకు వెళ్తున్నామని తెలిపారు. ప్రగతి నివేదన సభ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు నిద్ర పట్టడం లేదు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. అందుకే ఈనాడు ప్రజలందరూ టీఆర్‌ఎస్‌ పక్షాన నిలబడుతున్నారని మంత్రి పోచారం స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకొనేందుకు కేసీఆర్‌ ఓ ప్రణాలికతో ముందుకెళ్తున్నారని అన్నారు. ఇలాంటి వ్యక్తి సీఎంగా దొరకడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యమన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేయడం ద్వారా దేశానికే తెలంగాణ రైతులను ఆదర్శంగానిలిపేలా కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, మద్దతు ధరలు ఇలా అన్ని విధాల రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం తెరాస ప్రభుత్వం అని పోచారం పేర్కొన్నారు. అందుకే రైతులు తండోపతండాలుగా ప్రగతి నివేదన సభకు తరలి వస్తున్నారని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.