నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు 

– నాలుగు గేట్లు ఎత్తిన అధికారులు
– నాగార్జున సాగర్‌కు పరవళ్లు తొక్కుతున్న వరదనీరు
హైదరాబాద్‌, ఆగస్టు18(జ‌నం సాక్షి) :  కృష్ణమ్మ వరద ఉధృతి కొనసాగుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వచ్చే ఇన్‌ఫ్లో 3,47,671 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో శనివారం ఉదయం శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు అధికారులు ఎత్తివేశారు. జలాశయం నుంచి 2,07,561 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వారం రోజుల పాటు ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా..  ప్రస్తుతం 881.1 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగ.. ప్రస్తుతం నీటి నిల్వ 193.8 టీఎంసీలకు చేరింది. మరోవైపు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు కూడా వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టుకు వచ్చే ఇన్‌ఫ్లో 64,863 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 8,438 క్యూసెక్కులుగా ఉంది.. నాగార్జున సాగర్‌లో వాస్తవ నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 168 టీఎంసీలుగా ఉంది.