నిజమా..! నేను నిర్దోషిని

– ఎలాంటి మోసాలకు పాల్పడలేదు

– మాల్యా

లండన్‌,జూన్‌ 13(జనంసాక్షి):బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన మాల్యా యూకేలో దర్జాగా బతుకుతున్నారు. లండన్‌ లోని వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టులో మాల్యాను భారత్‌ కు అప్పగించే కేసు విచారణ జరిగింది. ఈ విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే జూలై 6కు వాయిదా పడింది. మాల్యాకు మంజూరు చేసిన బెయిల్‌ ను కూడా కోర్టు మరో ఆరునెలలు(డిసెంబర్‌ దాకా) వరకు పొడిగించింది. కోర్టుకు హాజరయ్యే ముందు మాల్యా తను నిర్దోషినని, ఎలాంటి మోసాలకు పాల్పడలేదని చెప్పారు. ప్రజల సొమ్ముని ఎగ్గొట్టి దర్జాగా యూకేలో బతుకుతున్న విజయ్‌ మాల్యాకు ఇటీవల ఓవెల్‌ క్రికెట్‌ మైదానంలో ఎదురైన తీవ్ర పరాభవం తెలిసిందే. క్రికెట్‌ స్టేడియంలోకి అడుగుపెట్టిన మాల్యాను చూసి అక్కడున్న వారందరూ చోర్‌.. చోర్‌(దొంగ.. దొంగ) అంటూ ఆయనను చుట్టుముట్టి గేళి చేశారు. ఊహించని పరిణామంలో షాక్‌ తిన్న మాల్యా, ఈ పరిణామంపై నేడు లండన్‌ కోర్టుకు హాజరయ్యే ముందు స్పందించారు. ఓవెల్‌ మైదానంలో తనను ఎవరూ దొంగా అని అనలేదని చెప్పుకొచ్చారు. తప్పతాగి ఉన్న ఇద్దరు వ్యక్తులు మాత్రమే తనపై అరిచారని, మిగతావారందరూ తన వద్దకు వచ్చి మంచి జరగాలని కోరుకున్నట్టు పేర్కొన్నారు. క్రికెట్‌ అభిమానులు స్టేడియం వద్ద తనను అవమానించారనే విూడియా వార్తలను మాల్యా కొట్టిపారేశారు. అయితే విజయ్‌ మాల్యా ఈ విషయం చెప్పగానే, ఆయనపై అరిచిన ఆ ఇద్దర్ని ట్విట్టరియన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆ ఇద్దరికి సెల్యూట్‌ చేయాలని ట్వీట్లు చేశారు. ఇదిలా ఉండగా భారీగా రుణం ఎగ్గొట్టి, బ్రిటన్‌ కు పారిపోయిన విజయ్‌ మాల్యాను ఉద్దేశించి విదేశాంగశాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం భువనేశ్వర్‌ లో విూడియాతో మాట్లాడుతూ మాల్యాను భారత్‌కు తీసుకురావడం చాలా కష్టమేనని అన్నారు. సరిగ్గా మాల్యా అప్పగింత కేసు విచారణ ప్రారంభమైన రోజే విదేశాంగ మంత్రి ఇలా మాట్లాడటంపై అందరినీ విస్మయానికి గురి చేసింది. బ్రిటన్‌తో మనకున్న ఒప్పందాల ప్రకారం మాల్యాను అప్పగించాల్సిందేనని ఆయన అన్నారు. అయితే అది అంత సులువుగా జరిగేదికాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున తమ వంతు ప్రయత్నాలు తాము చేస్తామని వీకే సింగ్‌ వెల్లడించారు. మరోవైపు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 800 పోస్టాఫీసుల్లో పాస్‌ పోర్టు సేవలు అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వీకే సింగ్‌ చెప్పారు. అందులో భాగంగా ఈ ఏడాది నుంచి 150 పోస్టాఫీసుల్లో సేవలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆధార్‌ కార్డుల జారీ, సమాచార మార్పులను కూడా పోస్టాఫీసుల్లో చేపడుతున్నామన్నారు.