నిజాంసాగర్‌కు జలకళ

నిజామాబాద్‌,సెప్టెంబర్‌ 26,(జనంసాక్షి): నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద గురించి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీరు పూర్తిస్థాయిలో రాకపోవడంతో జిల్లా ఆయకట్టు రైతులు ఆందోళనకు గురైనట్లు చెప్పారు. ఈ ఏడు ప్రాజెక్టులోకి నీరు రాదేమోనని సింగూరు నుంచి నీటిని విడుదల చేయించి రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తానన్న సమయంలోనే వరుణుడు కరుణించాడని తెలిపారు. ప్రస్తుతం చేరిన నీటితో ఆయకట్టు రైతులు రెండు పంటలు పండించుకోవచ్చని తెలిపారు. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా, ప్రస్తుతం 138 8.00 అడుగుల నీరుంది.ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిసామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా,ప్రస్తుతం 3.293 టీఎంసీల నీరుంది.ప్రాజెక్ట్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో ఉన్న సింగితం ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 416.550 విూటర్లు కాగా,ప్రస్తుతం అదేస్థాయిలో నీటిని అధికారులు నిల్వ ఉంచారు.పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 0.211 టీఎంసీల నీరు నిల్వ ఉంది.ప్రస్తుతం అదేస్థాయిలో నీరు నిల్వ ఉంది.ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వరద రావడం లేదు.ఎగువ ప్రాంతంలో ఉన్న సింగూరు ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం పెరగకున్నా, ఎగువ ప్రాంతాల నుంచి 1537 క్యూసెక్యుల వరద నీరు వచ్చి చేరుతుందని ఆధికారులు తెలిపారు.