నిజాం షుగర్స్‌ పై స్పష్టత ఇవ్వాలి: బిజెపి

నిజామాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్‌, సారంగపూర్‌ సహకార చక్కెర కర్మాగారాలను తెరిపించి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిన కేసీఆర్‌ నేటికీ ఎలాంటి చర్యలుచేపట్టకపోవటం దారుణమని బిజెపి జిల్లా నాయకుడు పల్లె గంగారెడ్డి అన్నారు. దీనిపైనా ఎంపి కవిత సమాధానం ఇవ్వాలన్నారు. పసుపు బోర్డు కోసం పోరాటం మంచిదే అయినా నిజాం షుగర్స్‌ కోసం ఎందుకు పోరాడడం లేదన్నారు. వ్వయసాయమంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. తెరాస సర్కారు నీళ్ల కోసమని నిధులను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోందన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పేరిట నిధులన్నీ పక్కదారి పట్టిస్తున్నారన్నారు. కాళేశ్వరంలో కొబ్బరికాయ కొడితే నిజాంసాగర్‌కు నీళ్లు వచ్చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటనలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులపై డీపీఆర్‌ను బయట పెట్టాలన్నారు. గ్యాంగ్‌స్టర్‌ నయీం హతమార్చిన ఘటనలో ప్రభుత్వ వైఖరిని సమర్తిస్తున్నామని, అయితే తెరవెనుక ఉన్న రాజకీయ నేతల పేర్లు బయటపడుతున్నందున ఈ కేసును సిట్టింగ్‌ జడ్జి సవిూక్షంలో న్యాయ విచారణ జరిపించాలని డిమాండు చేశారు. శాసనసభ ఆవరణలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటులో చూపిన శ్రద్ధ దళితుల రక్షణ విషయంలో చూప లేదంటూ నిజామాబాద్‌ ఎంపీ కవితపై మండిపడ్డారు.