నిజామాబాద్‌లో తప్పని బ్యాలెట్‌ పేపర్‌ పోరు

ప్రచారంలో ముందున్న టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత
బిజెపి, టిఆర్‌ఎస్‌ ఒక్కటే అంటున్న యాష్కీ
నిజామాబాద్‌,మార్చి29(జ‌నంసాక్షి): నిజామాబాద్‌  పార్లమెంట్‌ ఎన్నికల్లో బ్యాలెట్‌ పోరు తప్పేలా లేదు.
రైతులు పోటీలో నిలబడడంతో బ్యాలెట్‌ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్‌ఇనకల సంఘం నిర్ణయించింది. దీంతో ప్రధాన పార్టీలకు కొంత ఇబ్బంది తప్పేలా లేదు. అయితే ఎంపి కవిత మాత్రం ప్రచారంలో దూసుకుని పోతున్నారు. కాంగ్రెస్‌ నుంచి మధుయాష్కీ, బిజెపి నుంచి ధర్మపురి
అర్వింద్‌ బరిలో ఉన్నా ప్రచారంలో మాత్రం కవిత ముందున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఆమె ఓ దశ ప్రచారం పూర్తి చేశారు. ఇదిలావుంటే మధుయాష్కీ కూడా మెల్లగా ప్రచారంలోకి దిగారు. ప్రజలను కలుస్తూ కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరుతున్నారు. కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ వెనుక మోదీ ఉన్నారని ఆరోపించారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌ పక్ష నేతగా ఉన్న దళిత నేతకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతో తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 16 శాతానికి తగ్గాయని ఆరోపించారు. దేశంలో మైనార్టీలు, దళితులపై దాడులు జరుగుతుంటే టీఆర్‌ఎస్‌ కనీసం స్పందించిన దాఖలాల్లేవన్నారు.
టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని మధుయాష్కిగౌడ్‌ విమర్శించారు. ఈ రెండు పార్టీల బంధం బయటపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.  ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు.  ఈ ఎన్నికల్లో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగేతర శక్తిగా మారుతుందని ఆరోపించారు. గోమాత పేరుతో హత్యలకు పాల్పడే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ప్రధాని మోదీ తన స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని మతపరంగా విభజిస్తున్నారని అన్నారు. తాను గెలిచాక పసుపుబోర్డు సాధిస్తానని, పసుపునకు రూ.పదివేలు, ఎర్రజొన్నకు రూ.మూడు వేల క్వింటాలు చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసేలా కృషి చేస్తానని హావిూనిచ్చారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనీస ఆదాయం కల్పించే దిశగా పథకాలను అమలు చేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు వ్యత్యాసం ఉంటుందని అన్నారు. ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార రంగంలోకి దిగారు. ప్రచారానికి కేవలం 12 రోజులే సమయం ఉండటంతో ఉన్న సమయంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరుగనుండగా రెండు రోజుల ముందు అభ్యర్థుల ప్రచార పర్వానికి తెరపడుతుంది. ఈ మేరకు ఏప్రిల్‌ 9 వరకు రోజువారీ ప్రచార ప్రణాళికను కవిత తయారు చేసుకున్నారు. ఈ మేరకు పార్లమెంట్‌ స్థానంలో ఏడు నియోజకవర్గాల పరిధిలో అన్ని మండలాలు, వీలైనన్ని గ్రామాలు చుట్టి వచ్చేలా షెడ్యూల్‌ రూపొందించారు. రోడ్‌షోలు, ఓటర్లను నేరుగా కలవడం, ఇలా ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రచార సభలను కూడా నిర్వహించేం దుకు సం బంధిత ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం విూద గత ఎన్నికల్లో వచ్చిన దానికంటే రెట్టింపు మెజారిటీ సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్న కవిత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, రైతుబంధు వంటి పథకాలను వివరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలతో మమేకమవుతున్నారు.