నిజామాబాద్‌ నగర మాజీ మేయర్ సంజయ్‌ అరెస్టు

నిజామాబాద్‌(జ‌నం సాక్షి) : లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో నిజామాబాద్‌ నగర మాజీ మేయర్, డీఎస్‌ కుమారుడు సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న సంజయ్‌ ఈరోజు నిజామాబాద్ ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. న్యాయవాది కృపాకర్ రెడ్డితో కలిసి విచారణకు వచ్చారు. విచారణ అనంతరం సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో రెండు రోజుల్లో విచారణకు హాజరు కావాలని పోలీసులు సంజయ్ ఇంటికి ఈనెల 10న నోటీసులు అంటించారు. నోటీసుల్లో భాగంగా ఈరోజు న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు. తమను లైంగికంగా వేధిస్తున్నారని శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినిలు సంజయ్ పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సంజయ్‌పై 342, 354, 354A, 506, 509, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. సంజయ్‌ని ఏసీపీ సుదర్శన్ విచారించారు. లైంగిక ఆరోపణలపై ప్రశ్నించారు. అనంతరం అరెస్టు చేశారు. అయితే ఆదివారం కావడంతో సంజయ్‌ని పోలీసులు న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారు.