నిరంతర విద్యుత్‌తో దేశానికి ఆదర్శంగా కెసిఆర్‌

కేంద్ర విధానాలతో దేశంలో విద్యుత్‌ సంక్షోభం
మండిపడ్డ మంత్రి నిరంజన్‌ రెడ్డి
వనపర్తి,అక్టోబర్‌14 (జనం సాక్షి) : ఒక పక్క తెలంగాణలో నిరంతర విద్యుత్‌ను అందిస్తుంటే కేంద్రం మాత్రం విద్యుత్‌ సంక్షోభంలో కూరుకుపోయిందని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కెసిఆర్‌ సమర్థ పాలనకు విద్యుత్‌ పనితీరు నిదర్శనమన్నారు. కెసిఆర్‌ ఏనమూనాలను కాపీకొడుతున్న వారు విద్యుత్‌ విషయంలో ఎందుకు వెనకాడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాల మూలంగా ప్రస్తుతం దేశమంతా కరెంట్‌ కోతలతో సతమవుతున్నదని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో తెలంగాణలో కరెంట్‌ ఇబ్బందులు లేకుండా పోయాయన్నారు. గురువారం వనపర్తిలోని తన నివాసంలో లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష 116 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
అన్నారు. ఆసరా పథకం కింద వృద్ధులు, వితంతువులకు రూ.2016, దివ్యాంగులకు రూ.3016 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సంక్షేమ పథకాలతో పేదలకు టీఆర్‌ఎస్‌ సర్కారు అండగా నిలుస్తుందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఏ రాష్ట్రం తెలంగాణకు సాటి రాదన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్టాల్రు తీవ్ర కరంట్‌ సంక్షోభం ఎదుర్కొంటున్నాయని మంత్రి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపలేదు. ప్రణాళికాబద్ధంగా తెలంగాణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఏ శక్తులూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏం చేయలేవని మంత్రి స్పష్టం చేశారు.