నీతిఆయోగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి నేనురాను!

– ప్రణాళిక సంఘాన్ని భ్రష్టుపట్టించి.. నీతి ఆయోగ్‌ను తెచ్చారు
– నీతి ఆయోగ్‌కు ఎటువంటి అధికారాలు లేవు
– ప్రధానికి మూడు పేజీల లేఖను పంపిన పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా, జూన్‌7(జ‌నంసాక్షి) : నీతి ఆయోగ్‌ కౌన్సిల్‌ సమావేశానికే నేను హాజరుకాబోనని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖరాశారు. గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోదీ
విధానాలపై విమర్శలు గుప్పిస్తున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణాళిక సంఘాన్ని భ్రష్టుపట్టించి, దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను తీసుకువచ్చారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీతి ఆయోగ్‌కు ఎటువంటి అధికారాలు లేవని, అందుకే తాను కౌన్సిల్‌ సమావేశానికి హాజరుకాబోనని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ.. ప్రణాళిక సంఘం స్థానంలో జనవరి 1, 2015లో నీతీ ఆయోగ్‌ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేశారని, ఆర్థిక అంశాల్లో రాష్ట్రాలకు ఎటువంటి అధికారాలు కట్టబెట్టకుండా నిబంధనలు తెచ్చారంటూ మమతా లేఖలో మండిపడ్డారు. రాష్ట్రాలకు ఇందులో ఎటువంటి ప్రాధాన్యం ఉండదని, సలహాలు, సూచనలకు మద్దతు లభించదని, కాబట్టి ఇటువంటి సంస్థ సమావేశాలకు హాజరవ్వడం వల్ల ఉపయోగం లేదని మమత పేర్కొన్నారు. ఈ క్రమంలో జరిపే చర్చలు ఫలప్రదం కావని మమత తన లేఖలో పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధికై నిధులు విడుదల చేసేలా తమకు కొన్ని అధికారాలు కట్టబెట్టాలని అడిగినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ విమర్శించారు. కాగా జూన్‌ 15న నీతిఆయోగ్‌ కౌన్సిల్‌ తొలి సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంస్థ పునర్‌ వ్యవస్థీకరణకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రాజీవ్‌ కుమార్‌ నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ¬ం మంత్రి అమిత్‌ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, వ్యవసాయ,  రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఇందులో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా చేరనున్నారు. ప్రధాన మోదీ చైర్మన్‌గా వ్యవహరించే నీతి ఆయోగ్‌లో కే సరస్వత్‌, రమేష్‌ చాంద్‌, డాక్టర్‌ వీకే పాల్‌ సభ్యులుగా ఉంటారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, లెప్టినెంట్‌ గవర్నర్లు ఈ భేటీకి హాజరుకానున్నారు.