నూతన పంచాయితీ భవనం ప్రారంభం

వికారాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి ): తాండూరు మండలం మిట్ట బాసుపల్లిలో రూ.13 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయితీ భవనాన్ని రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం 50 మంది రైతులకు వంద శాతం సబ్సిడీ కింద నీటి డ్రమ్ములను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్‌ కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయితీలు ఏర్పాటు చేస్తున్నారని ఈ సందర్భంగా మహేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటీసీ రవిగౌడ్‌, ఎంపిపి లక్ష్మి, మండలం రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ రామలింగా రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కరుణం పురుషోత్తం రావు తదితరులు పాల్గొన్నారు.