నేటి నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు


` ఏర్పాట్లపై శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్‌
` కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
` కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ప్రభుత్వానికి, అధికారులకు అభినందనలు
` సభ జరిగే తేదీలు, ఎజెండా తదితర అంశాలపై బీఏసీలో నిర్ణయం
హైదరాబాద్‌,సెప్టెంబరు 23(జనంసాక్షి):రేపట్నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల సన్నద్ధత ఏర్పాట్లను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ సవిూక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులతో స్పీకర్‌, ప్రొటెం ఛైర్మన్‌ సమావేశమయ్యారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌ భాస్కర్‌ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనాను సమర్థంగా అరికట్టేందుకు కృషి చేసిన ప్రభుత్వం, అధికారులకు సభాపతి పోచారం అభినందనలు తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలోనూ తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, నీతి ఆయోగ్‌ ఛైర్మన్‌ సైతం ప్రశంసించారని అన్నారు. నేటి ప్రారంభం కానున్న సమావేశాలు పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం, అధికారులు సహకరించాలని కోరిన ఆయన.. సభ్యులు అడిగే సమాచారాన్ని త్వరగా అందించాలని సూచించారు. పెండిరగ్‌లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపాలని చెప్పారు. సమావేశాల్లో కొవిడ్‌ నిబంధనలు అమలు చేయడంతో పాటు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పోచారం సూచించారు. భద్రతా ఏర్పాట్లపై డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులతో శాసనసభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ సమావేశమయ్యారు. సమావేశాలు ప్రశాంతంగా జరిగేలా పోలీసుశాఖ నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభ, మండలి.. అక్టోబర్‌ 1 వరకు కొనసాగే అవకాశముంది. సభ జరిగే తేదీలు, ఎజెండా తదితరాలపై అసెంబ్లీ సమావేశాల తొలి రోజున జరిగే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీలో నిర్ణయిస్తారు.శని, ఆది వారాల్లో విరామం తర్వాత తిరిగి ఈ నెల 27 నుంచి వరుసగా ఐదు రోజుల పాటు సభలు సాగే అవకాశముంది. ప్రొటెమ్‌ చైర్మన్‌ హోదాలో వెన్నవరం భూపాల్‌రెడ్డి తొలిసారి మండలి సమావేశాలను నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ‘దళితబంధు’కు చట్టబద్దత కల్పించే బిల్లుతో పాటు మరో ఏడు బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. కొన్ని ఆర్డినెన్స్‌లకు చట్టబద్ధత కల్పించే బిల్లులు కూడా ఇందులో ఉన్నట్లు తెలిసింది. వరి ధాన్యం కొనుగోలు, నదీ జలాల వివాదం, దళితబంధు పథకం, ఉద్యోగాల భర్తీ, సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన వంటి అంశాలు సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశముంది.అసెంబ్లీ సమావేశాలను కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో మాదిరిగానే పోలీస్‌, విూడియా, అధికారులు, శాసనసభ, మండలి సభ్యుల వెంట వచ్చే సహాయ సిబ్బందిని పరిమిత సంఖ్యలో అనుమతించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, పోలీసులు, విూడియా ప్రతినిధులు కోవిడ్‌ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్న గత నిబంధనను పాక్షికంగా సడలించారు. ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా అసెంబ్లీ ఆవరణలో కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు వ్యాక్సినేషన్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైన వారికి తొలి, రెండో దశ కోవిడ్‌ టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు.తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లోని 4 కి.విూ. పరిధిలో సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిషేధించినట్టు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.వివిధ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో జరిగే చర్చలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఈ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం ఉదయం 6గంటల నుంచి అమల్లోకి వచ్చే ఈ నిషేధాజ్ఞలు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ముగిసే వరకూ వర్తిస్తాయని ఆయన తెలిపారు.