నేటి నుంచి స్త్రీ వైద్య నిపుణుల సదస్సు

మూడ్రోజులపాటు వివిధ అంశాలపై చర్చ

కరీంనగర్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి ): కరీంనగర్‌లో మూడు రోజుల పాటు స్త్రీ వైద్య నిపుణుల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10 నుంచి 12 వరకు సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ విజయలక్ష్మి తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంలో మొదటిసారిగా కరీంనగర్‌లో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంతానలేమి, హిస్టక్టమ్రి, సాధారణ ప్రసవాలతో పాటు స్త్రీ సంబంధ వ్యాధులకు సంబంధించిన అనేక అంశాలపై జాతీయ, రాష్ట్రస్థాయి ప్రముఖ వైద్య నిపుణులతో సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అధునాతన, లాప్రోస్కోపిక్‌ శస్త్రచికిత్సలు, ఇతర వైద్య విధానాలపై వివరించడమే కాక సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచేలా వైద్య నిపుణులు ఆయా అంశాలను వివరిస్తారని పేర్కొన్నారు. ఈ సదస్సును కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ ప్రారంభిస్తారన్నారు. అనేక ఇతర అంశాలను చర్చిస్తామని అన్నారు. స్థానికంగా పనిచేస్తున్న వైద్యులకు ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.