నేడు ఆటోలు,క్యాబ్‌ల బంద్‌

హైదరాబాద్‌,జనవరి7(జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం మోటర్‌ వెహికిల్‌ చట్ట సవరణ సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 8న మంగళవారం ఆటోలు, పాఠశాలల వ్యాన్‌లు, క్యాబ్‌ల బంద్‌ పాటించనున్నట్లు పలు ఆటో మోటారురంగ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు తమకు మద్దతుగా నిలవాలని కోరాయి. తెలంగాణ ఆటోడ్రైవర్ల యూనియన్‌ ఐకాస కన్వీనర్‌ మహమ్మద్‌ అమానుల్లాఖాన్‌, ఏఐటీయూసీ నేత బి.వెంకటేశం, టి.ఆర్‌.ఎస్‌.కె.వి. నేత వి.మారయ్య, ఐఎన్‌టీయూసీ ప్రతినిధి జి.మల్లేష్‌గౌడ్‌, ఐఎఫ్‌టీయూ నేత ఎ.నరేందర్‌, దాసరి రమేష్‌ తదితరులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎంవీ యాక్ట్‌ సవరణ బిల్లును బలవంతంగా రుద్దుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 8న ఆటోల బంద్‌, 9న నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆటోడ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రైవేటు ఫైనాన్సర్ల దోపిడీని అరికట్టాలని కోరారు. బంద్‌కు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు.