నేడు చివరి టీ ట్వంటీ

లండన్‌,జూలై7(జ‌నం సాక్షి): సిరీస్‌ ఫలితాన్ని తేల్చే ఆఖరి టీ20 మ్యాచ్‌ ఆదివారం జరగనుంది. ఇప్పటికే టీమిండియా, ఇంగ్లండ్‌ చెరో మ్యాచ్‌లో విజయం సాధించారు. దీంతో ఆదివారం మయాచ్‌ ఉత్కంఠగా మారింది. టీమ్‌ఇండియాతో తొలి టీ20లో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్‌.. రెండో మ్యాచ్‌లో సత్తా చాటింది. కార్డిఫ్‌ వేదికగా జరిగిన రెండో టీ-20లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ 5, ధావన్‌ 10 పరుగులు చేసి ఔటవగా.. తొలి టీ-20 సెంచరీ హీరో రాహుల్‌ సైతం 6 పరుగులకే ఔటయ్యాడు. కెప్టెన్‌ కోహ్లీ 47 పరుగులతో రాణించగా.. ధోనీ 32 రన్స్‌ తో నాటౌట్‌గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ మరో రెండు బంతులు మిగిలుండగానే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అలెక్స్‌ హేల్స్‌ 58 పరుగులతో అజేయంగా నిలవగా.. బెయిర్‌ స్టో 28 రన్స్‌ తో రాణించాడు.