నేడు జిల్లాలో బిజెపి ఆవిర్భావ వేడుకలు

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ఈ నెల 6న బుధవారం జిల్లావ్యాప్తంగా బిజెపి ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని, కేందప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. అలాగే  ఈనెల 14న అంబేడ్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించాలని భాజపా రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామాన అంబేడ్కర్‌ చిత్రపటాలతో జయంతి ఉత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. కొందరు విశ్వవిద్యాలయాల్లో ప్రశాంత వాతావరణం లేకుండా విద్యార్థుల భవితవ్యంతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటి వెనుక వామపక్ష, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కొందరి కుట్ర దాగి ఉందని విమర్శించారు.  దేశంలో ప్రధాని నరేంద్రమోది సంక్షేమ పాలనను ఓర్వలేకనే ఏబీవీపీ నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా బనాయిస్తున్న తప్పుడు కేసులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఎత్తివేయాలని కోరారు. పాలమూరు యూనివర్సిటీలో కొందరు ఏబీవీపీ నాయకులపైన దాడులు చేసి వారే పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి కేసులు పెట్టించారని ఆరోపించారు. ఏబీవీపీ నాయకులను చంపాలని కుట్రచేశారని, వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు.