నేడు టి-సాట్ స్టూడియోకు గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్,జూన్25(జనం సాక్షి ):తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘రైతుబంధు-రైతు భీమా’ పథకాలపై సలహాలు-సూచనలు అందించేందుకు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి టి-సాట్ స్టూడియోకి హాజరౌతున్నారు.ఈ నెల 26వ తేది మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు జరిగే ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొంటారు.తెలంగాణ వ్యాప్తంగా ‘రైతు బంధు’ పథకం అమలు తీరు, ‘రైతు భీమా’ పథకంపై సుఖేందర్ రెడ్డి సలహాలు-సూచనలు అందించనున్నారు. టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు నిపుణ, విద్య అందించే ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొంటారని టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి ప్రకటించారు. రైతులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, అధికారులు, సిబ్బంది ఫోన్ ద్వార రైతుబంధు, రైతు భీమా పథకాలపై తమ తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సీఈవో కోరారు. గుత్తా సుఖేందర్ రెడ్డితో మాట్లాడాలనుకునే వారు 040 23553473, టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 4038 కు కాల్ చేయాలని సూచించారు.