నేడు పాలమూరులో బిజెపి ఎన్నికల సభ

 

 

విమోచన ఉత్సవాలపైనా దూకుడు

పార్టీ బలప్రదర్శనకు రంగం సిద్దం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత ప్రధాన నగరమైన నగరాల్లో పట్టు సాధించేందుకు బిజెపి వ్యూహరచన చేస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా.. ఎప్పటి నుంచో తాము డిమాండ్‌ చేస్తున్న విమోచన దినాన్ని అధికారికంగా చేపట్టాలని కోరుతూ గత నాలుగేళ్లుగా ఆందోళనలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా 15న పాలమూరులో నిర్వహించే సభలో విమోచనపైనా ప్రకటన చేయనున్నారు. 20 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భాజపా మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు సమాలోచనలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 15న పాలమూరు నిర్వహించే బహిరంగ సభకు జాతీయ అధ్యక్షుడు అమిత్‌

రానున్నట్లు లక్ష్మణ్‌ చెప్పారు. ఈ బహిరంగ సభ నుంచే అమిత్‌ షా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ విభిన్న వర్గాలకు తాయిలాలు ప్రకటించి విస్మరించారని దుయ్యబట్టారు. తెరాస, తెదేపా, కాంగ్రెస్‌కు ఓటేస్తే మజ్లీస్‌కే ఓటేసినట్లని లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణలో గల్లంతైన తెదేపా.. భాజపాను ఓడిస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. అలాగే సభ తరవాత ఈనెల 17న

మరోమారు విమోచనోత్సవాలను నిర్వహించి తెలంగాణ జిల్లాల్లోని క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపేందుకు రంగం సిద్ధం చేసింది. అదేరోజు ప్రధాని మోడీ జన్మదినం కావడంతో ఇలా రెండు కార్యక్రమాలను కలిపి ప్రజల్లో పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక అమిత్‌షా పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. ప్రణాళికాయుతంగా ముందుకెళ్తే తెలంగాణలో గట్టిపోటీ ఇవ్వవచ్చని భావిస్తున్న కేంద్ర నాయకత్వం విమోచన దినోత్సవాన్ని ఈసారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీనికితోడు 15న పాలమూరులో సభ ద్వారా సత్తా చాటాలని చూస్తున్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని గత పుష్కర కాలంగా పోరాడుతున్న కమలనాథులు ఏటా సెప్టెంబరు 17న ఏదో రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు వివిధ జిల్లాల కలెక్టరేట్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు యత్నించారు. తెరాస పాలనాపగ్గాలు చేపట్టాక కూడా విమోచన దినాన్ని అధికారికంగా చేపట్టపోవడంతో అవకాశాన్ని అందిపుచ్చుకున్న భాజపా ఈసారి భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలమూరు సభకు భారీగా జనాన్ని సవిూకరించి సత్తా చాటాలని భావిస్తోంది. సభ విజయవంతమైతే పార్టీ క్యాడర్‌లో నూతనోత్తేజం నెలకొంటుందని.. ఇది ఎన్నికల వరకు ఉపకరిస్తుందని భావిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలలో నరేంద్రమోఢీ హవాతోకేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న బిజెపి తెలంగాణలో మాత్రం తన పట్టును నిరూపించుకోలేదు. గత ఎన్నికలో టిడిపితో జతకట్టి కేవలం ఒక్క పార్లమెంటు, ఐదు అసెంబ్లీ స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. నిజానికి ఈ నాలుగున్నరేళ్లలో బిజెపి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అధికార టిఆర్‌ఎస్‌ను మరపించేలా కార్యక్రమాలు చేయలేకపోయింది. టిఆర్‌ఎస్‌ను తిడితే బిజెపిని మెచ్చుకుంటారన్న ధోరణి తప్ప మరోటి కాదు. ప్రధాని స్వయంగా ప్రతిపాదించి ప్రచారం చేసిన స్వచ్ఛభారత్‌ అభాసుపాలవుతోంది. హైదరాబాద్‌తోపాటు కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో పార్టీకి బలమైన క్యాడర్‌ ఉంది. విభజన తర్వాత తెలంగాణలో పట్టు సాధించవచ్చనే ఆశలు.. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌ ముందు ఆవిరయ్యాయి. పాలమూరు సభ విజయవంతమైతే అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగడంతోపాటు పూర్వ వైభవం సాధించవచ్చని భావిస్తున్న పార్టీ రాష్ట్ర నేతలు ఇప్పటికే జిల్లాను చుట్టుముట్టారు.సభను విజయవంతం చేసే బాధ్యతను భుజాన వేసుకున్న పార్టీ నేతలు ఇప్పటికే జిల్లాలో పర్యటించి వెళ్లారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ యాత్ర ద్వారా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కమలం విజయం సాధించకుండా ఏ శక్తి ఆపలేదంటూ పార్టీ శ్రేణులకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మార్గదర్శనం ఇవ్వడంతో పాలమూరు సభ ద్వారా ఉద్యమిస్తున్నారు.