నేడు మహబూబ్‌నగర్ పర్యటనకు మంత్రి కేటీఆర్

మహబూబ్‌నగర్ : రాష్ర్ట పంచాయతీరాజ్ , ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజలకు ఆరోగ్య సేవలు మెరుగు పర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ-హెల్త్ ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సేవలను మంత్రి కేటీఆర్ ఈవాళ జడ్చర్లలో ప్రారంభించనున్నారు. ఈ-హెల్త్ ఆరోగ్య సేవలతో ఆసుపత్రికి వచ్చే రోగుల వ్యాధి తీవ్రతను బట్టి ఆన్‌లైన్‌లో వైద్యసేవలు అందిస్తారు. ఉదయం 11 గంటలకు స్థానిక బాదేపల్లి కమ్యూనిటి హెల్త్ సెంటర్‌లో ఈ హెల్త్ సేవలను ప్రారంభించటంతో పాటు ప్రస్తుత ఆసుపత్రిని 100 పడకల విస్తరణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల శివారులోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం, గంగాపూర్ రోడ్డులో గల పత్రి మార్కెట్ యార్డులో మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు.