నేడు విశాఖలో పర్యటించనున్న చంద్రబాబు

అమరావతి,జూన్‌20(జ‌నం సాక్షి ): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం విశాఖలో పర్యటించనున్నారు. నగరంలో ఏడు గంటల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఉదయం 10.45 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. నేరుగా రుషికొండలోని సాయిప్రియా రిసార్ట్స్‌ చేరుకుని వుడా అభివృద్ది చేసిన అమృత వ్యాలీని ప్రారంభిస్తారు. 12 గంటలకు అక్కడే ఆంధప్రదేశ్‌ ఆరోగ్య ఉత్సవ్‌ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.45 గంటలకు సాయిప్రియా రిసార్ట్స్‌ నుంచి బయలు దేరి పోర్టు అతిధి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. నగరంలో తొమ్మిది వేల మందికి నివాస స్ధలాలను రెగ్యులరైజ్‌ చేసే కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో గాజువాకకు చెందిన ఐదు వేల మందికి నివాసాలనుక్రమబద్దీకరించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సభ నిర్వహణ ఉంటుంది. సాయంత్రం 5.25 గంటలకు తిరిగి ప్రత్యేక విమానంలో విజయవాడ తిరుగు ప్రయాణమవుతారు.