నేడే చలో ట్యాంక్‌బండ్‌

– అనుమతి నిరాకరించిన ప్రభుత్వం
– ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవు
– ట్యాండ్‌ బండ్‌వైపు ఎవరొచ్చినా అరెస్టు చేస్తాం
– స్పష్టం చేసిన సీపీ అంజనీకుమార్‌
– అఖిలపక్షం నేతల విజ్ఞప్తిని తిరస్కరించిన సీపీ
– ప్రభుత్వం తీరుపై మండిపడ్డ అఖిపక్షం నాయకులు
– చలో ట్యాంక్‌బండ్‌ చేసి తీరుతామని వెల్లడి
– రాత్రి వరకు హైదరాబాద్‌ చేరుకోవాలని కార్మికులకు అశ్వత్థామ పిలుపు
– ముందస్తు అరెస్టు చేస్తున్న పోలీసులు
– ట్యాంక్‌బండ్‌ సవిూప ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు
హైదరాబాద్‌, నవంబర్‌8 (జనంసాక్షి) : ఆర్టీసీ జేఏసీ నేతలు శనివారం తలపెట్టిన సకల జనుల సామూహిక దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సామూహిక దీక్షకు అనుమతి ఇవ్వలేమని సీపీ అంజనీకుమార్‌ ఖరాఖండిగా చెప్పారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్యాంక్‌ బండ్‌ వైపు ఎవరొచ్చినా అరెస్టు చేస్తామన్నారు. గురువారం అఖిల పక్ష నేతలు కోదండరామ్‌, ఎల్‌.రమణ, తమ్మినేని వీరభద్రం, చాడా వెంకట్‌ రెడ్డి, నారాయణ నేతృత్వంలోని కొందరు అఖిలపక్ష నేతలు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ను కలిసి చలో ట్యాంక్‌ బండ్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే సామూహిక దీక్షకు సీపీ అనుమతి నిరాకరించారు. శనివారం ఎవరైనా ట్యాంక్‌ బండ్‌ వచ్చినా, చట్టాన్ని తమ చేతిలోకి తీసుకేంటే వారందరినీ అదపులోకి తీసుకుంటామన్నారు. కచ్చితంగా అరెస్టు ఉంటాయని చెప్పి సూచనప్రాయంగా చెప్పారు. దీంతో ఛలో-ట్యాంక్‌ బండ్‌ కార్యక్రమానికి అనుమతి కోరినా పోలీసులు ఇవ్వడం లేదని, ముందస్తు అరెస్టులు చేస్తున్నారని టీజేసీ అధ్యక్షుడు కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మూర్ఞంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా శనివారం మధ్యహ్నం చలో ట్యాంక్‌ బండ్‌ జరిపి తీరుతామని కోదండరాం స్పష్టం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. హైకోర్టు మొట్టికాయలు వేసినా ముఖ్యమంత్రికి సోయి రావటం లేదని విమర్శించారు.  ఏపీఎస్‌ ఆర్టీసీ నుంచి విడిపోకుండా.. విధానపరమైన నిర్ణయం తీసుకునే హక్కు టీఎస్‌ ఆర్టీసీకి లేదని ఆయన చెప్పారు. కేంద్రం అనుమతి లేకుండా.. ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేసే హక్కు కేసీఆర్‌కు లేదని వెల్లడించారు. కార్మికులకు మద్దతుగా సామూహిక నిరసన దీక్షలకు దిగుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ముందస్తు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని లేకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. చలో ట్యాంక్‌ బండ్‌ కు అనుమతిని నిరాకరించటంతో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుమార్చుకోకపోతే మున్ముందు తీవ్ర అబాసు కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులను, అఖిలపక్షం నేతలను ముందస్తు అరెస్టు చేయడం ద్వారా చలో ట్యాంక్‌ బండ్‌ ముట్టడిని ఆపలేరని హెచ్చరించారు. ఖచ్చితంగా చలో ట్యాంక్‌ బండ్‌ ముట్టడి చేపడామని, కార్మికుల, అఖిలపక్షం నేతలంతా రాత్రి వరకు హైదరాబాద్‌ చేరుకొనేలా రావాలని, తద్వారా చలో ట్యాంక్‌ బండ్‌ను విజయవంతం చేసి ప్రభుత్వానికి మన సత్తాచూపుతామని అశ్వత్థామ కార్మికులకు పిలుపునిచ్చారు.