నేను సూపర్‌మ్యాన్‌ అంటావు

.. కానీ ఏం చెయ్యవు
– ఢిల్లీ ఎల్జీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, జులై12(జ‌నం సాక్షి) : సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. నగరంలో చాలా ప్రాంతాల్లో విపరీతంగా చెత్త పేరుకు పోవడంతో దానిని తొలగించే బాధ్యత ఎల్జీదా, ముఖ్యమంత్రిదా తక్షణమే సమాధానం ఇవ్వాలని కోర్టు ఇటీవల ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే చెత్త తొలగింపు బాధ్యత పురపాలక సంఘానికి సంబంధించిందని, తాను దానిని పర్యవేక్షిస్తున్నానని ఎల్జీ బైజల్‌ కోర్టుకు తెలిపారు. దీంతో గురువారం కోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. ‘నాకు అధికారం ఉంది. నేను సూపర్‌ మ్యాన్‌ అని చెప్తుంటారు విూరు. కానీ ఏవిూ చెయ్యరు. అని కోర్టు ఎల్జీని దుయ్యబట్టింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అధికారం ఉన్నప్పటికీ దాన్నిఉపయోగించట్లేదని పేర్కొంది. చెత్త తొలగించేందుకు ఎన్ని సార్లు మార్గదర్శకాలు ఇచ్చారు? దాన్ని తొలగించడానికి ఎంత సమయం పడుతుందని అని కోర్టు ఎల్జీని ప్రశ్నించింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ పట్ల సానుకూలంగా స్పందించింది. ఈ విషయంలో సీఎంను లాగొద్దని, ఆయనను నిందిచొద్దని తెలిపింది. ఎందుకంటే ఎల్జీ పురపాలక విభాగంపై తనకే అధికారాలు ఉంటాయని చెప్పినందున ఇక సీఎంను దీనిలోకి తీసుకురావొద్దని కోర్టు స్పష్టంచేసింది. ఢిల్లీలోని ఘాజిపూర్‌, ఓక్లా, భాల్‌స్వా ప్రాంతాల్లో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోతుండగా, దాని తొలగింపునకు సంబంధించి ఏర్పాటు చేసిన ఏ సమావేశంలోనూ ఎల్జీ కార్యాలయం నుంచి ఒక్కరు కూడా హాజరుకాలేదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. చెత్త సేకరించే వారికి యూనిఫాం, ఐడీ కార్డులు ఇవ్వాలని కోర్టు ఎల్జీని ఆదేశించింది. ఘన వ్యర్థాల నిర్వహణకు తమ విధానాలేంటన్నది ఇంతవరకూ వెల్లడించని పది రాష్టాల్రకు  కేంద్ర పాలిత ప్రాంతాలకు కోర్టు రెండ్రోజుల క్రితం రూ.లక్ష చొప్పున జరిమానా విధించిన సంగతి తెలిసిందే. కనీసం విచారణ నిమిత్తం న్యాయవాదులనైనా పంపని రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.2లక్షల చొప్పున అపరాధ రుసుము విధించింది.