నేపాల్‌ పార్లమెంటు రద్దు

– మధ్యంతర ఎన్నికలకు మొగ్గు

కాఠ్‌మండూ,డిసెంబరు 20 (జనంసాక్షి): నేపాల్‌లో రాజకీయ వివాదం తారాస్థాయికి చేరుకుంది. అధికార పార్టీలో తలెత్తిన వివాదాలు పార్లమెంటు రద్దుకు దారితీశాయి. దీంతో పార్లమెంటును రద్దు చేయాలంటూ చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆ దేశ ప్రధాని కె.పి.శర్మ ఓలీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి చేసిన సిఫారసుకు అధ్యక్షురాలు, రాష్ట్రపతి విద్యాదేవి భండారి తాజాగా ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో నేపాల్‌లో త్వరలోనే రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 30, మే 10న పార్లమెంటు ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయిప్రధాని కె.పి.శర్మ ఓలీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి.. పార్లమెంటును రద్దుచేయాలంటూ మండలి అధ్యక్షురాలు విద్యాదేవీ భండారీకి సిఫారసు చేసింది. ఆదివారం ఉదయం అత్యవసర సమావేశం నిర్వహించిన మంత్రి మండలి ఈ మేరకు అనూహ్య నిర్ణయం తీసుకుంది. అధికార నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సీపీ)లో కొంతకాలంగా తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయి ప్రధాని పీఠం కోసం ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజా ఘటనతో అవి మరింత తారస్థాయికి చేరుకున్నట్లైంది.