తెలంగాణ వ్యాప్తంగా నేరస్తుల సమగ్ర సర్వే

– నేరగాళ్ల వివరాలు సేకరిస్తున్న పోలీస్‌ సిబ్బంది
– వివరాలను జియోట్యాగింగ్‌ చేసి టీఎస్‌ యాప్‌లో పొందుపర్చనున్న పోలీసులు
హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేరస్తుల సమగ్ర సర్వే గురువారం ప్రారంభం అయింది. పదేళ్లలో పోలీసు రికార్డుల్లో ఉన్న నేరగాళ్ల ఇళ్లకు అధికారులు, సిబ్బంది వెళ్లి వారి వివరాలను సేకరిస్తున్నారు. ఈ సర్వేలో కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు అన్ని స్థాయిల అధికారులు పాల్గొన్నారు. ప్రతి నేరస్తుడి సమాచారం, వారి ఇళ్లనూ జియో ట్యాగింగ్‌ చేసి టీఎస్‌ యాప్‌ పొందు పరచనున్నారు. గురువారం సర్వే పూర్తి కాని నేపథ్యంలో పూర్తయ్యే వరకు కొనసాగుందని, ప్రతి నేరస్తుడి ఆచూకీ కనిపెట్టి వివరాలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో 45వేల మంది నేరస్తులున్నారు – సీపీ
నగరంలోని రాంనగర్‌ బస్తీలో నేరస్థుల సమగ్ర సర్వేలో హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్‌ ఐదు జోన్లలో 45 వేల మంది నేరస్థులు ఉన్నారని తెలిపారు. హైదరాబాద్‌లో నేరాలకు పాల్పడి ఇతర జిల్లాలో ఉన్నవారు నాలుగువేల మంది ఉన్నారని, హైదరాబాద్‌లో నేరాలకు పాల్పడి ఇతర రాష్టాల్ల్రో ఉన్నవారు మూడువేల  మంది ఉన్నారని తెలిపారు. నేరస్థుల వివరాలు సేకరణ పూర్తయ్యే వరకు సర్వే కొనసాగుతుందని తెలిపారు. మేడ్చల్‌లో నేరస్థుల సమగ్ర సర్వే ప్రారంభమైంది.. జిల్లాలోని 805 మంది నేరస్థుల వివరాలు సేకరించనున్నట్లు ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.
సైబరాబాద్‌ పరిధిలో మొత్తం 20,000 మంది నేరస్థులు..
ప్రజలకు నమ్మకాన్ని కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నెరస్థుల పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు అదే విధంగా వారి కదలికలను పసికట్టే విధంగా నేరస్థుల సమగ్ర సర్వే చేపట్టడం జరిగిందని మాదాపూర్‌ జోన్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు.. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 20,000 మంది నేరస్థులు ఉన్నారని పేర్కొన్నారు. మాదాపూర్‌ జోన్‌ లో మొత్తం 6,000 మంది నేరస్థులు, మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 454 మంది నేరస్థులు, గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌
పరిధిలో 232 మంది నేరస్థులు, రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 235, కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి లో 1311, కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 983, నర్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 738, మియపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 717, చందనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 601, ఆర్‌ సి పురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 523, బచూపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 193 నేరస్థులు ఉనట్లు మాదాపూర్‌ జోన్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు, ప్రతి నేరస్తుల వివరాలు జియోట్యాగ్‌ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో..
రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సకల నేరస్థుల సమగ్ర సర్వే నిర్వహిస్తున్న పోలీసులు. సమగ్ర సర్వేలో భాగంగా ఎల్బీనగర్‌, వనస్దలిపురం, హయత్‌ నగర్‌, అబ్దుల్లా పూర్‌ మెట్‌  పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ప్రాంతాలలో నేరాలు చేస్తున్నపలువురిని పోలీసులు గుర్తించి సర్వే నిర్వహిస్తున్నారు. ఎల్బీనగర్‌ – 951, వనస్దలిపురం -728, హయత్‌ నగర్‌ – 537, అబ్దుల్లా పూర్‌ మెట్‌ -124 నేరస్తులు ఉన్నట్లు తెలిపారు.
సెంట్రల్‌ జోన్‌ పరిధిలో..
2008 నుంచి సౌత్‌ జోన్‌ పరిధిలో 2269 మంది పాత నేరస్థుల ఉన్నట్టు గుర్తించారు. చిక్కడపల్లి -334, ముషీరాబాద్‌ -520, గాంధీనగర్‌ – 283, సైఫాబాద్‌ – 224, నాంపల్లి – 170, రాం గోపాల్‌ పేట్‌ – 70, అబిడ్స్‌- 123, నారాయణ గూడ – 229, బేగం బజార్‌ -165. మంది నేరస్తులు ఉన్నట్లు పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు.