నైతిక విద్యతోనే నేరాలకు అడ్డుకట్ట

అత్యాచారం,హత్యల్లాంటి కేసుల్లో సత్వర న్యాయం జరక్కపోవడం లాంటి కారనాల వల్ల పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తోంది. ఇది ఎప్పటికైనా డేంజర్‌ అని గుర్తిచాలి. ఇప్పుడు చప్పట్లు కొడుతున్న ప్రజలే రేపు భయంతో పరుగెత్తే రోజులు వస్తాయి. హర్షిస్తున్న నేతలకు కూడా ఇది ముప్పుగా పరిణమిస్తుంది. అవినీతి, అక్రమాలకు పాల్పడే నేతలను కూడా కాల్చేయాలని ప్రజలు డిమాండ్‌ చేసి తిరగబడితే అది వారికే ముప్పు కానుంది. సమాజంలో అసమానతలు, అవిద్య, నైతిక విలువల పతనం లాంటి పరిస్థితులు తీవ్ర నేరాలకు దారితీస్తున్నాయని గమనించాలి. దిశ ఎన్‌కౌంటర్‌ విషయం తీసుకుంటే అత్యాచార కేసులో సత్వర న్యాయం జరగదన్న భావనలో ప్రజలు ఉండడం వల్లనే పోలీస్‌ ఎన్‌కౌంటర్‌ను స్వాగతించారు. నిజానికి ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోతాయి. పోలీసులు ఎంతో కష్టపడి సమాచారాన్ని, నేరానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సేకరించినా ఒక్కోసారి కోర్టుల్లో నిలబడడం లేదు. అలాంటి సందర్భాల్లో కేసులు కొట్టివేయబడుతున్నాయి. దీంతో నేరస్థులు కూడా తమను ఏవిూ చేయలేరన్న భావన నెలకొంటోంది. ఆర్థిక నేరాల్లో ఇటీవల అనేక సంఘటనలు చూశాం. వేలకోట్లు పోగేసుకునిదేశాన్ని ముంచి విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ లాంటి వారు విదేశాలకు పారిపోయినా ఏవిూ చేయలేకపోయాం. ఇలాంట ఇనేరాలకు కూడా కఠిన శిక్షలు అమలయితే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. నేరం చేయాలనుకున్న వారు భయపడతారు. అయితే మనచట్టాల్లో అలాంటి కాఠిన్యం లేకపోవడం వల్ల అనేక రకాల నేరాలు జరగడం, నేరస్థులు బాజాప్తా తిరగడం జరుగుతోంది. రాజకీయ చిత్తశుద్ధి, పాలనాపరమైన నైపుణ్యం లేకపోవడ, పాలకుల్లో చిత్తశుద్ది కొరవడడం కారణంగా అనేకానేక నేరాలు చోటుచేసుకుంటున్నాయి. మహిళల అత్యాచార ఘటనలపై నిర్భయ లాంటి చట్టం కఠినంగా అమలయి ఉంటే ఇవాళ దిశ విషయంలో ఎన్‌కౌంటర్‌కు ఆస్కారం ఉండేది కాదు. ప్రజల ఆలోచనా వైఖరి, విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. సమాజంలో దేశ సంస్కృతి పట్ల గౌరవం పెరగాలి. చిన్నప్పటి నుంచే సమాజం పట్ల బాధ్యత కలిగిన పాఠ్యాంశాలను బోధించాలి. నీతికథలకు ప్రాధాన్యం పెరగాలి. పిల్లలకు చిన్నప్పుడే నీతికథలను బోధించక పోతే పెద్దయ్యాక అవి ఎక్కవు. మహిళలు, గురువులు, పెద్దలను ఎలా గౌరవించాలో పాఠశాల స్థాయి నుంచి బోధిస్తూనే వారిలో సమాజం పట్ల బాధ్యతను పెంచడం,దేశం పట్ల గౌరవం పెంచడం వంటి కార్యక్రమాలను రూపొందించాలి. బాధితులు ఫిర్యాదులు చేసినప్పుడు సత్వరమే స్పందించడంతో పాటు, వేగవంతమైన విచారణ, సత్వర న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం పోలీస్‌ వ్యస్థపైనా ఉంది. సమాజంలో నైతిక విలువలు వేగంగా పతనమవుతున్నాయనడానికి వరుస ఘటనలే నిదర్శనం. విచ్చల విడితనం పెరుగుతోంది. డబ్బు సంపాదనే ధ్యేయంగా సాగుతున్నాయి. భారతీయ సంస్కృతికి మూలమైన నీతి,నిజాయితీ, పెద్దలను,స్త్రీలను గౌరవించే సంప్రదాయాల మూలాల్లోకి తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో మనుగడ కోసం ప్రకృతిని, సంస్కృతిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని మరోమారు మనల్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరికీ ఉచితంగా కనీసం ప్రాథమిక విద్యను అందించాలి. పేదరికానికి దారితీస్తున్న కారణాలను అన్వేషించాలి. మద్యం విచ్చలవిడిగా అమ్మడం కూడా సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాటిని పరిష్కరించేందుకు పాలకులు చిత్తశుద్ధితో పని చేయాలి. ఆ మేరకు పాలనలో ఫలితాలు చూపేలా ప్రయత్నాలు చేయాలి. పాలకులే అవినీతి,అక్రమాల్లో మునిగితే ఇక ప్రజలకు వారిపట్ల విశ్వాసం ఎక్కడి నుంచి రాగలదు. ఓట్ల కోసం తాత్కాలికంగా ఇచ్చే తాయి లాలకు లొగిపోవడం వల్ల నేరప్రవృత్తికలిగినపాలకులు వచ్చి సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తారని గుర్తుంచు కోవాలి. పేదలకు ఎలాంటి మేలు చేయని, సామాజిక, లింగ వివక్షతో పాటు ఆర్థిక అంతరాలు చూపే కార్యక్రమాలను అంగీకరించరాదు. పాలకులు ఎల్లవేళలా ప్రజలకు చేరువై సుపరిపాలన ద్వారా ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా చూడాల్సిన బాధ్యత ఉంది. అధికారులపైనా ఈ బాధ్యత ఉంది. కట్టుబాట్లు, విద్య,సంస్కృతి, బాధ్యతలు లేకపోవడం వల్లనే ఉన్నావ్‌, వరంగల్‌, కుమ్రం భీమ్‌, షాద్‌నగర్‌ లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వీరంతా సమాజాంలో చీడపురుగల్లా పెరిగారు. అందుకే బరితెగించారు. ఏం చేసినా ఏవిూ కాదులే అన్న రాక్షస మనస్తత్వాన్ని అలవర్చుకున్నారు. అందుకే వారు హతం కావడమే గాకుండా వారి కుటుంబాల్లో శోకాన్ని నింపారు. అలాగే వారి ప్రవృత్తి వల్ల తల్లిదండ్రులకు కూడా చెడ్డపేరు తెచ్చారు. చదువు ఉండి, బాధ్యతగా పనిచేసివుంటే వారి జీవితం ఇలా ముగిసేది కాదు. సమాజం కూడా ఇందుకు బాధ్యత వహించాలి. చదువు,సంస్కారంతో పాటు సమాజంలో వింతపోకడలు లేకుండా ముందుకు సాగాలి. ఆడపిల్లల పెంపకంలో ఉండే శ్రద్ధ మగపిల్లలపై కూడా ఉండాలి. పెంపకం సరిగ్గా ఉండాలి. మన ఇంటి ఆడపిల్లల్ని ఎలా చూస్తామో బైట అమ్మాయిల్ని కూడా అలాగే చూడాలన్న భావన వారిలో కల్గించాలి. అప్పుడే మూర్ఖపు, తప్పుడు ఆలోచనలు రావు. తప్పుచేస్తే ఇంట్లో అమ్మానాన్నలే దండిస్తారన్న భయం ఇంటినుంచే రావాలి. ఆడపిల్లలకుండే పరిమితులు, పరిధులు మగపిల్లలకు ఉండటం లేదు. ఇవన్నీ కూడా ప్రాథమిక విద్య నుంచే అలవడేలా పాఠ్యాంశాలను మళ్లీ తిరిగి రూపొందించాలి. సచ్ఛీలతలను ఆధారం చేసుకునే విధంగా మన చదువులు సాగకపోతే నష్టపోయేది మనమే అని గుర్తుంచుకోవాలి.