నోట్లేవీ రద్దు కావడంలేదు: ఆర్బీఐ

ముంబయి,జనవరి 25(జనంసాక్షి):దేశంలో పలు పాత కరెన్సీ నోట్లు రద్దు చేస్తారంటూ వస్తోన్న వార్తలపై రిజర్వు బ్యాంకు స్పందించింది. అలాంటి వార్తలను కొట్టిపారేస్తూ ట్వీట్‌ చేసింది. దేశంలో రూ.100, రూ.10, రూ.5 సిరీస్‌ కరెన్సీ నోట్లు చలామణిలోనే ఉంటాయని స్పష్టంచేసింది. ఈ మూడు రకాల పాత నోట్లను భవిష్యత్తులోనూ ఉపసంహరించుకోబోమని తెలిపింది.2016 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 పాత నోట్లు రద్దు చేసినప్పటికీ.. రూ. రూ.5, రూ.10, రూ.100లను మాత్రం కొనసాగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రూ.10 నుంచి రూ.2వేల వరకు కొత్త నోట్లు, నాణేలు సైతం ముద్రిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చలామణిలో ఈ పాత నోట్ల విషయంలో మార్చి నెలలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోబోతోందంటూ వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగా పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లను మార్చడమో, లేదంటే వాటిని పూర్తిగా ఉపసంహరించుకోవడమో జరుగుతుందంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని తేల్చి చెబుతూ ఆర్బీఐ ట్విటర్‌లో ప్రకటించింది.