నోట్ల రద్దు కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికేనా? 

ఏడాది దాటింది. నోట్లరద్దు జరిగిన తరవాత నల్లడబ్బు ఖజానాకు చేరుతుందని నమ్మబలికిన ప్రధాని మోడీ అనేక సంస్కరణలకు ఇదే మూలం అన్నారు. అద్భుతాలు జరుగుతాయన్నారు. అతిపెద్ద సంస్కరణ అంటే పదేపదే ఊదరగొడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోలేక పోతున్నారు. ఏడాదిగా ప్రజలు నగదు చలామణి లేకపోవడంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఏడాదిగా ఏవిూ జరగలేదని తేలిపోయింది. నోట్ల రద్దు తరవాత ఆర్థికష్టాలు అలాగే ఉండిపోయాయి. ప్రజల ఇబ్బందులు తప్పడం లేదు. బ్యాంకులు నిర్వీర్యం అయ్యాయి. ప్రజలకు సేవచేసే సంస్థలుగా ఉండాల్సిన బ్యాంకులను పక్కా వ్యాపార కేంద్రాలుగా తయారు చేశారు. సర్వీస్‌ ఛార్జీల పేరుతో ప్రజలను పీడించి పిప్పి చేస్తున్నారు. దీనికితోడు జిఎస్టీ కారణంగా ప్రజలు, వ్యాపారులు నానా అవస్థలు పడుతున్న పట్టించుకునే స్థిలో ప్రధాని మోడీ లేరు.

దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి, అసంఖ్యాక ప్రజానీకం జీవితాలను ఛిద్రం చేసిన మోడీ ప్రభుత్వ నోట్ల రద్దు, జిఎస్‌టి చర్యలకు వ్యతిరేకంగా నవంబరు 8న దేశవ్యాప్త ‘నిరసన దినం’ పాటించాలని విపక్షాలతో పాటు వామపక్షాలు, మరోవైపు ఇతర ప్రతిపక్షాలు పిలుపునిచ్చారు. అయితే దనీఇకి పోటీగా అన్నట్లు ఆ రోజును ‘నల్లధన వ్యతిరేక దినం’గా జరుపుతామని అధికార బిజెపి ప్రకటించడం దాని సంకుచిత స్వభావాన్ని వెల్లడిస్తోంది. ప్రజల బాధలను అర్థం చేసుకోవాల్సన పాలకులు ఇదేదో ప్రతిపక్షాల కార్యక్రమంగా చూడడం దారుణం కాక మరోటి కాదు. అవినీతిపరులను, నల్లధనులను రక్షించే చర్యలొక వైపు చేపడుతూ, మరోవైపు ‘నల్లధన వ్యతిరేక దినం’ గురించి మాట్లాడడం బిజెపికే చెల్లింది. విదేశీ, స్వదేశీ కార్పొరేట్ల సేవలో తరించి పోతున్న మోడీ ప్రభుత్వం గత ఏడాది నవంబరు 8న ఆకస్మికంగా 500, వెయ్యి నోట్లను రద్దు చేసి సామాన్య ప్రజలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. దాని తరువాత అది ప్రవేశ పెట్టిన జిఎస్‌టి దేశంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలను, వ్యాపారాలనూ మరింత సంక్షోభంలోకి నెట్టింది. ప్రజల ఉపాధిని దెబ్బ తీసింది. మొత్తం దేశ ఆర్థికాభివృద్దే దీనివల్ల మందగించింది. ప్రధానంగా గ్రావిూణ ఆర్తిక వ్యవస్థను దెబ్బతీసింది. తమది అతిపెద్ద కార్యకర్తలు ఉన్న పార్టీ అని చెప్పుకుంటున్న బిజెపి ఈ రెండు విషయాల్లో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నిజాయితీగా తెలుసుకునే ప్రయత్నాలు చేయలేదు. తాను తీసుకున్న నిర్ణయాలతో కాంగ్రెస్‌ నాయకులు భయపడుతున్నారని, బినావిూ ఆస్తులపై మేం తుపాను రేకెత్తించేలోగా పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసి, నా పట్ల భయాన్ని కలిగించాలని వారు చూశారని తాజాగా ప్రధాని మోడీ హిమాచల్‌ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే నోట్ల రద్దు కేవలం కాంగ్రెస్‌కు సంబంధించిన వ్యవహారంగానే చూస్తున్నారు. కాంగ్రెస్‌ వారు దోచుకున్నదంతా తిరిగివ్వాల్సిన సమయంవచ్చింది. వారు ఆ బినావిూ ఆస్తుల్ని తమవిగా చెప్పుకోలేనంత పరిస్థితిని నేను తీసుకురాబోతున్నా. పేదల నుంచి దోచుకున్నదానిని వారికి ఇవ్వాల్సిందేనని మోదీ చెప్పడం చూస్తుంటే క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన లేదనుకోవాలో లేక తెలుసుకోవాలన్న ఆసక్తి లేదనో అర్థం అవుతుంది. నోట్లరద్దు నిర్ణయం అమల్లోకి వచ్చిన నవంబరు 8వ తేదీని- ‘నిరసన దినం’గా పాటించాలని కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని తప్పుపడుతున్నారు. నిజానికి విపక్షాలకు అది నల్లధన దినమని ఎద్దేవా చేశారు. అవినీతిపై తన పోరాటాన్ని అవి దిగమింగుకోలేక ఆరోజు బహుశా తన దిష్టిబొమ్మల్ని దహనం చేయవచ్చని చెప్పారు. పేదలు, మధ్యతరగతివారు ఎప్పటిలా తమ పనులు తాముచేసుకుంటున్నా అవినీతిపరులు మాత్రం ఆగ్రహంతో ఉన్నారనీ, నగదు మూటల్ని బ్యాంకుల్లో జమచేయాలని చెప్పినందుకు తనపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారనీ ఆరోపించారు. మొత్తంగా ప్రధాని సమస్యలను మరో కోణంలో చూస్తున్నారు. ఆయన సమస్యను ప్రజల పక్షాన కాకుండా కాంగ్రెస్‌ పక్షాన చూస్తున్నారు.

మరో వందేళ్లు గడిచినా కూడా కాంగ్రెస్‌ పార్టీని భారతీయులు విశ్వసించబోరనీ, అన్ని పాపాలను ఆ పార్టీ చేసిందనీ చెప్పారు. కాంగ్రెస్‌ వాళ్లు రూ.500 నోట్ల మూటల్ని, మరికొందరు రూ.వెయ్యి నోట్ల మూటల్ని కోల్పోయారు. ఈలోగానే బినావిూ ఆస్తుల నిషేధ చట్టాన్ని తెచ్చాం. ఇప్పుడు దాని ఫలితాలను రాబడతాడని వారు భయపడుతున్నారు. రూ.500, రూ.1000 నోట్లను దాచుకున్నట్లుగా స్థలాలు, ఫ్లాట్లు, దుకాణాలు వంటి బినావిూ ఆస్తులన్నిటినీ దాచుకోవడం కుదరదనేది వారి కలవరం. అందుకే నల్లధన దినం వంటివి పాటించి, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు అని మోదీ తన ప్రచారంలో ఆరోపించారు.

మొత్తంగా ప్రధాని మోడీ కేవలం సమస్యలను కాంగ్రెస్‌ కోణంలో చూస్తూ నల్లడబ్బు లేదా నోట్లు వారివద్దనే ఉన్నాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదన్న ధోరణఙలో ఉన్నారు. దీనిపై ప్రజల పక్షాన ఎలాంటి వాదన చేసినా లాభం లేదని అనుకోవాల్సిందే. 2014 ఎన్నికలకు ముందు విదేశాల్లో వున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని చెప్పిన మోడీ ఆ పనికోసమే తాను పెద్ద నోట్లు రద్దు చేస్తున్నానని ప్రకటిస్తే దేశ ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి నిజమేనని నమ్మారు. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్ల ధనవంతులు సుమారు 5 లక్షల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని బ్యాంకుల్లో వేయకుండా చెత్త కుండీల్లో పారేస్తారని, ఆ మేరకు ప్రభుత్వం చేతికి డబ్బు వస్తుందని దాంతో అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేయవచ్చునని బిజెపి పరివారం నమ్మబలికారు. పాకిస్తాన్‌ నుండి దేశంలోకి వచ్చిన దొంగడబ్బు కూడా రద్దయిపోతుందని చెప్పారు. కానీ జరిగింది దీనికి భిన్నం. పెద్ద నోట్ల రద్దువల్ల కొన్ని నెలల పాటు ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరి బాధలు పడ్డారు. అవసరాలకు డబ్బు చిక్కక వందమందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఒక్క నల్లధనవంతుడు కూడా బ్యాంకు ముందు నిలబడలేదు. మోడీ చెప్పిన నల్ల డబ్బు, దొంగ సొమ్ము దర్జాగా బ్యాంకులకు చేరుకుందని ప్రభుత్వ లెక్కలే చెప్పాయి. ఈ నిర్వాకానికి మోడీ సర్కారు, కాషాయ దళాలు సిగ్గుతో తలదించుకోవలసిందిపోయి ఈ దిక్కుమాలిన చర్య తీసుకున్న రోజును నల్లధన వ్యతిరేక దినంగా జరపాలనుకోవడం దాని బరితెగింపుకు నిదర్శనం.