నోములకు ఆస్టేల్రియా తెలంగాణ వాసుల నివాళి
హైదరాబాద్,డిసెంబర్5 (జనంసాక్షి) : దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు ఆస్టేల్రియాలోని తెలంగాణ వాసులు ఘనంగా నివాళులర్పించారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గత మంగళవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఆస్టేల్రియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్ర, అడిలైడ్, బ్రిస్బేన్లోని ప్రవాస తెలంగాణ సంఘాలు, వివిధ పార్టీల నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నోముల నర్సింహయ్య ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. అణగారిన వర్గాల కోసం పోరాడారని, నాగార్జునసాగర్ ఎన్నికలలో గులాబి జెండా గౌరవాన్ని పెంచారని చెప్పారు. ఎల్లప్పుడూ ప్రజాక్షేమాన్ని అభివృద్ధి కోసం పాటుపడిన అరుదైన నాయకుడని వెల్లడించారు. నోముల మరణం టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి ఎంతో నష్టమన్నారు. ఈ కార్యక్రమంలో మంజు, మోనికా, అవంతి, సతీష్, రమేష్, శ్రీధర్, ప్రేమ్, రవి, భార్గవ్, వీరేందర్, సంజయ్, రాజవర్ధన్ రెడ్డి, చందూ, రుద్ర ఇతర ప్రవాస తెలుగు సంఘాలు, పార్టీల సభ్యులు పాల్గొన్నారు.