పంచాయితీల్లో డంపింగ్‌ యార్డులు తప్పనిసరి

ఆదిలాబాద్‌,నవంబర్‌14(జనం సాక్షి): గ్రామాల్లో ఉన్న డంపింగ్‌ యార్డుల్లోకి చెత్తను తరలించేలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గతంలోలాగా కాకుండా ఇటీవల పంచాయితీ ప్రణాళిక మేరకు ఇప్పుడు పారిశుద్ధ్యానికి ప్రాధానయం ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు ఏర్పాటుచేసి చెత్తను తరలించాలని కలెక్టర్‌ దివ్యాదేవరాజన్‌ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహావిూ సిబ్బందితో కార్యక్రమాల అమలును  సవిూక్షించారు.ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు ఉండేలా చూడాలని, ఉన్న వాటిలోనే చెత్తను వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు. గ్రామాల్లో స్థలం లేనిచోట ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. గ్రావిూణ ప్రాంతాల్లో పెంటలను గ్రామానికి దూరంగా ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు చెప్పాలన్నారు. లేదంటే కంపోస్టు ఫీట్స్‌ నిర్మించి ఇవ్వాలని, దీంతో రైతుకు సేంద్రియ ఎరువు తయారు చేసుకునే వీలు కలుగుతుందన్నారు. ఇవన్నీ 30 రోజుల ప్రణాళికలో పూర్తయ్యేలా చూసుకోవాలని చెప్పారు.