పంజాగుట్టలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో గల నిమ్స్ దవాఖాన ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న 132 కేవీ డీసీ యూజీ కేబుల్ వైర్ల పనుల కారణంగా పంజాగుట్ట వైపునకు భారీ వాహనాలను, ఆర్టీసీ బస్సులను అనుమతించడం లేదని నగర పోలీస్ ఇన్‌చార్జి కమిషనర్ డీఎస్ చౌవాన్ తెలిపారు. శ్రీనగర్ కాలనీ రోడ్డు(బిగ్‌బజార్ వెనుక వైపు) నుంచి నిమ్స్ దవాఖాన ఎదురుగా ఉన్న రెడ్ రోజ్ హోటల్ వరకు ఈ కేబుల్ పనులు జరుగుతున్నాయని సీపీ వెల్లడించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా భారీ వాహనాలపై ఈ నెల 19 నుంచి వచ్చే నెల 31 వరకు 43 రోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నామన్నారు.

భారీ వాహనాల ఇలా మళ్లింపు..

– సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్‌చెరువు వైపు నుంచి వచ్చే బస్సులను పంజాగుట్ట వైపు అనుమతించరు. ఈ రూట్‌లో వచ్చే ఆర్టీసీ బస్సులను కూకట్‌పల్లి వై జంక్షన్ మీదుగా నర్సాపూర్ ఎక్స్ రోడ్డు, బాలానగర్, బోయిన్‌పల్లి, తాడ్‌బన్ జంక్షన్, బాలమ్‌రాయ్ జంక్షన్, పారడైజ్ హోటల్ జంక్షన్, అప్పర్‌ట్యాంకుబండ్, అంబేద్కర్ విగ్రహం, తెలుగు తల్లి జంక్షన్, ఏజీ ఆఫీస్, రవీంధ్రభారతి రూట్‌లలో వెళ్లాలి.
– పటాన్‌చెరు, మియాపూర్, కూకట్‌పల్లి వైపు నుంచి ఆంధ్ర, రాయలసీమకు అమీర్‌పేట్, పంజాగుట్ట మీదుగా వెళ్లే వాహనాలను అమీర్‌పేట్ మైత్రి వనం వైపు అనుమతించరు. ఈ వాహనాలు ఎస్‌ఆర్‌నగర్‌లోని గౌతమ్ డిగ్రీ కాలేజ్ ముందు యు టర్న్ తీసుకొని అక్కడ ప్రయాణికులను ఎక్కించుకొని తిరిగి కూకట్‌పల్లి రూట్‌లోకి వెళ్లాలి.
– మియాపూర్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి వైపు నుంచి ఖైరతాబాద్ వైపునకు వచ్చే సిటీ బస్సులు, నిత్యావసర వస్తువులు తరలించే వాహనాలు, పెట్రోల్, గ్యాస్ సరఫరా చేసే వాహనాలను ఎస్‌ఆర్‌నగర్ ఎక్స్ రోడ్డులో మళ్లిస్తారు. ఈ వాహనాలను ఆర్ అండ్ బీ సిగ్నల్స్, సోనబాయ్ టెంపుల్, అమీర్‌పేట్ జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, డీకే రోడ్డు జంక్షన్, గ్రీన్‌ల్యాండ్ జంక్షన్, మోనప్ప ఐలాండ్, రాజ్‌భవన్ రోడ్డు మీదుగా ఖైరతాబాద్ రూట్‌లో వెళ్లాలి. ఆర్టీసీ బస్సులను అమీర్‌పేట్ ఎక్స్ రోడ్డులో గ్రీన్‌ల్యాండ్ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఈ వాహనాలను రాజ్‌భవన్ రోడ్డులో నుంచి ఖైరతాబాద్ చౌరస్తా మీదుగా సాధారణ ట్రాఫిక్‌లో కలుస్తాయి.
– కృష్ణానగర్ నుంచి శ్రీనగర్‌కాలనీ మీదుగా ఖైరతాబాద్‌కు వచ్చే వాహనాలను శ్రీనగర్‌కాలనీ జీహెచ్‌ఎంసీ పార్కు వద్ద శ్రీనగర్ టీ జంక్షన్‌కు మళ్లిస్తారు. ఎంజే ఇంజినీరింగ్ కాలేజీ నాగార్జున సర్కిల్, జీవీకే మాల్, తాజ్ కృష్ణ, కేసీపీ జంక్షన్ నుంచి ఖైతరాబాద్ చౌరస్తాకు వెళ్లాలి.
– కృష్ణానగర్ నుంచి బేగంపేట్, ఎస్‌ఆర్‌నగర్‌కు శ్రీనగర్‌కాలనీ మీదుగా వెళ్లే వాహనాలను కృష్ణానగర్ ఎక్స్‌రోడ్డులో యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వైపు మళ్లీస్తారు. యూసుఫ్‌గూడ, కృష్ణకాంత్ పార్కు, వెంగళ్‌రావునగర్ మీదుగా ఈ వాహనాలను ఎస్‌ఆర్‌నగర్ జంక్షన్ చేరుకోవాలి.