పచ్చని హైదరాబాద్‌ చూసి కండ్లుమండుతున్నాయి

– హైదరాబాద్‌ అందరిదీ.. కొందరి కానివ్వం

– హైదరాబాద్‌కు ఏంజేశిన్రో సూటిగా జెప్పుండ్రి..

– ఈసారి సెంచరీ కొడతాం

– బస్తీమే మంత్రి కేటీఆర్‌ సవాల్‌

హైదరాబాద్‌,నవంబరు 21(జనంసాక్షి): అందరి హైదరాబాద్‌ను కొందరి హైదరాబాద్‌కు మార్చేందుకు కుట్ర పన్నుతున్నవారికి ఓటుతో బుద్ధి చెప్పాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ ప్రజలను కోరారు. నగరంలోని కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్‌, మూసాపేట్‌ డివిజన్ల టీఆర్‌ఎస్‌ కార్పొరేట్‌ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గతంలో ఎ?ట్లెతే ప్రచారం ప్రారంభించుకుంటే కలిసొచ్చిందో మళ్ళీ అదే పద్ధతిలో ఇక్కడనే ప్రారంభించి విజయఢంకా మ్రోగించాలని చెప్పి కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచే పార్టీ ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.డిసెంబర్‌ 1న జరిగే పోలింగ్‌ ద్వారా ఓల్డ్‌ అల్లాపూర్‌ కార్పొరేటర్‌గా సబీనా, మూసాపేట కార్పొరేటర్‌గా శ్రవణ్‌కుమార్‌ ఎన్నిక కాబోతున్న సందర్భంగా అందరూ చప్పట్లతో హర్షధ్వానాలు తెలపాలన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు. ఆరేళ్లక్రితం ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేసి తెలంగాణ ఇప్పుడు అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉందన్నారు. నగరంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు. ఓట్ల కోసం బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నరన్నారు. వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తే బీజేపీ నేతలే ఆపారన్నారు. వరద బాధితులందరికి న్యాయం చేస్తామని.. బాధితులందరికీ రూ. 10 వేలు అందిస్తామని తెలిపారు.

హైదరబాద్‌ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎన్నో పనులు చేపట్టారు. మరి ఆరేండ్లలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఒక్కపనైనా చేసిందా అని ప్రశ్నించారు. పచ్చగా ఉన్న హైదరాబాద్‌లో బీజేపీ నేతలు నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తున్నరు. ప్రశాంతంగా ఉన్న హైదారాబాద్‌లో అలజడి రేపే ప్రయత్నం చేస్తున్నరు. ఓట్లకోసం శాంతిని చెడగొట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ఈసారి సెంచరీ కొట్టేద్దాం: కేటీఆర్‌

హైదరాబాద్‌: అందరి హైదరాబాద్‌ను కొందరి హైదరాబాద్‌గా మార్చాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్‌పల్లి ఓల్డ్‌ అల్లాపూర్‌, మూసాపేట, ఐడీపీఎల్‌ చౌరస్తాల్లో కేటీఆర్‌ ప్రసంగించారు. గత ఎన్నికల్లో ఒక్క సీటుతో తెరాస సెంచరీ కోల్పోయిందని.. ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో శతకం పూర్తి చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజలందరినీ కలుపుకొని వెళ్తున్నారని.. ప్రశాంతమైన హైదరాబాద్‌ కోసం తెరాసనే గెలిపించాలని ప్రజలను కోరారు. ఆరేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పనులు చేసిందన్నారు. రాష్ట్రంలో పేకాట క్లబ్బులు, గుడుంబా గబ్బులు, మత కల్లోలాలు ఎక్కడా లేవన్నారు. ప్రజల కోసం పనిచేసే వారిని తిరిగి కార్పొరేషన్‌కు పంపించాలని కేటీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.”ఆరేళ్లలో హైదరాబాద్‌లో మంచి జరిగిందా? చెడు జరిగిందా? అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలి. నగరంలో ఆరేళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ఇవాళ లేవు. అన్ని రకాలుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకున్నాం. ప్రజల సహకారంతో విద్యుత్‌, మంచినీళ్ల సమస్యను పరిష్కరించాం. తెరాస రూ.10వేలు ఇస్తామంటే ఆపిన వారు ఇవాళ రూ.25 వేలు ఇస్తారట. కావాలని జుమ్మా రోజు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ధర్నా చేశారు. ఆలయాల వద్ద ధర్నాలు చేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే చార్మినార్‌ వద్దే ఎందుకు? నగరంలో మరెక్కడా దేవాలయాలు లేవా?ఎందుకంటే.. హిందు, ముస్లింలు కలిసి ఉంటే వారికి నచ్చదు. హైదరాబాద్‌ పచ్చగుంటే వారు ఓర్వలేకపోతున్నారు. ఎలాగైనా ప్రజలు మధ్యలో చిచ్చుపెట్టి అశాంతిని రేకెత్తించాలి. ఇక ఈ మంటల్లో నాలుగు ఓట్లు సంపాదించుకోవాలి. అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా? ప్రజలే ఆలోచించాలి. ఏ రకమైన హైదరాబాద్‌ ఉంటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో ప్రజలే తేల్చుకోవాలి” అని కేటీఆర్‌ అన్నారు.

బాలాపూర్‌లో..

”ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకునే బాధ్యత మాది. తెలంగాణ ఏర్పడినప్పుడు హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో అనే అనుమానాలు ఉండేవి. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావడం కాదు.. ఉన్నవే పోతాయని కొంత మంది అన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రాష్ట్రంలో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇవేవీ విపక్షాలకు కనిపించడం లేదా? రోజు 50వేల మందికి రూ.5కే భోజనం అందిస్తున్నాం. తొందర్లోనే లక్ష రెండు పడకల ఇళ్లు పంపిణీ చేస్తాం. కరోనా వచ్చినా.. వరద వచ్చినా.. విూకు అండగా ఉన్నాం. సంక్రాంతిలోగా బాలానగర్‌ వంతెనను పూర్తి చేస్తాం” అని కేటీఆర్‌ వివరించారు.