పర్యాటకరంగాన్ని పట్టాలకు ఎక్కిస్తా


కరోనాతో రెండేళ్లుగా దెబ్బతిన్న పర్యాటకం
యాదాద్రీశుడి సేవలో పాల్గొన్న కిషన్‌ రెడ్డి
ప్రారంభమైన జనాశీర్వాద యాత్ర
యాదాద్రిభువనగిరి,ఆగస్ట్‌21(జనంసాక్షి): యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున ఆయన బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కిషన్‌రెడ్డికి ఆలయ ఈవో, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణలతో
అర్చకులు కిషన్‌రెడ్డిని ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ నూతన నిర్మాణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణాల గురించి ఆర్కిటెక్చర్‌ ఆనంద్‌ సాయి కిషన్‌రెడ్డికి వివరించారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి యాదాద్రిలోని హరిత హోటల్‌లో బస చేసిన కిషన్‌రెడ్డి.. యాదాద్రీశుడిని దర్శించుకున్న అనంతరం తిరిగి మూడో రోజు యాత్రను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో పర్యాటక శాఖను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి చెప్పారు. జనవరి నుంచి పర్యాటక రంగాన్ని పునఃప్రారంభించాలని అనుకుంటున్నా మన్నారు. తెలుగు ప్రజల ఆశీస్సులతోనే కేంద్ర మంత్రి అయ్యానని తెలిపారు. తనపై ప్రధాని మోదీ కీలక బాధ్యతలు పెట్టారని చెప్పారు. కరోనా కారణంగా రెండేళ్లుగా పర్యాటకం దెబ్బతిందని వివరించారు. దేశంలో పర్యాటక శాఖను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. యునెస్కో గుర్తించిన 40 కేంద్రాలు దేశంలో ఉన్నాయని.. వాటిల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. బతుకమ్మ, బోనాల, వినాయకచవితి, మేడారం జాతరలను చిత్రించి దేశ వ్యాప్తంగా చూపించ బోతున్నాం. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్ర పండుగలను గుర్తిస్తాం. భువనగిరి కోటకు ప్రత్యేకత ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. రోప్‌ వే ద్వారా పర్యాట కులను ఆకర్షింపజేయాలి. భద్రాచలం, వేములవాడ ఆలయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గత పాలకులు ఈ ఆలయాల అభివృద్ధిని పట్టించు కోలేదని కిషన్‌రెడ్డి అన్నారు. అనంతరం భువనగిరిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ఈశాన్య రాష్టాల్రకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నామని తెలిపారు. ఈశాన్య రాష్టాల్ల్రో ఆర్గానిక్‌ వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తున్నా మన్నారు. దేశంలో పర్యాటక రంగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు .బతుకమ్మ, గిరిజన పండగలు, సమ్మక్క`సారక్క జాతరలను వచ్చే రెండేళ్లలో టూరిజం స్పాట్‌లుగా చేయనున్నట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి భువనగిరి కోటను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ఆయన హుజురాబాద్‌ లాంటి ఎన్నికలు గతంలో ఎక్కడా చూడ లేదన్నారు. కుటుంబ రాజకీయాలు చేసేవారిని ప్రజలు తిప్పికొడుతారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.