పలుప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

రైతుల చెతంకే కొనుగోలు కేంద్రాలు
మద్దతు ధరలు పొంది సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యేలు
హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని పలుచోట్ల ప్రజాప్రతినిధులు శనివారం ధాన్యం కొనుగోలు
కేంద్రాలను ప్రారంభించారు. గతంలోఒ ఎన్నడూ లేనివిధంగా గ్రామస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. దళారుల ప్రమేయలం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రైతులకు గిట్టుబాటు ధరలు అందుతాయని, రవాణా సమస్య తీరి రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని ఖత్‌గావ్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే ప్రారంభించారు. జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట్‌లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అదేవిధంగా వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాజయ్య ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు మద్దతు ధర అందుతోందని ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో రైతును పట్టించుకన్నా నాథుడే కరువయ్యారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్‌ వరి ధాన్యం క్వింటాలుకు రూ.1590, సీ-గ్రేడ్‌ రకానికి రూ.1550 అందజేస్తున్నట్లు చెప్పారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రతీ గ్రామానికి గోదావరి జలాలను అందించడంతో వరి సాగు పెరిగిందని చెప్పారు. ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ప్రతి ఎకరానికి రూ.8వేలు రైతులకు అందజేస్తూ పెట్టబడి కింద సాయం అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే దక్కిందన్నారు. రైతుబంధు పథకంతో వ్యవసాయం ఇక పండుగలా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. రైతులను రాజులను చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నట్లు వివరించారు. వ్యవసాయ రంగం, రైతాంగ శ్రేయస్సు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రపంచస్థాయిలో గుర్తింపు వస్తున్నట్లు చెప్పారు. రైతుల పంటలకు పెట్టుబడి కోసం ఎకరాకు రూ.4 వేల ఆర్థిక సాయం అందజేస్తుండడంతో ఎవుసాయానికి జవసత్వాలు చేకూరుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రైతుల అభివృద్ధే ధ్యేయమని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అన్ని గ్రామాల ప్రజలు అండగా నిలవాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుల వృత్తులను పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కుల సంఘాలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. కల్యాణలక్ష్మీ పథకం కింద రూ.75 వేల నుంచి రూ.లక్షా116లకు పెంచి సీఎం కేసీఆర్‌ పేదల కుటుంబాలకు పెద్దన్న పాత్ర పోశిస్తున్నారని అన్నారు.