పవన్‌.. ఎంతకు అమ్ముడుపోయావ్‌..?

– అవిశ్వాస తీర్మానం నుంచి పారిపోయిన పిరికివాడు పవన్‌
– పవన్‌పై టీడీపీ నేత వర్లరామయ్య ఆగ్రహం
అమరావతి, జులై21(జ‌నం సాక్షి) : పవన్‌ కళ్యాణ్‌ బీజేపీకి అమ్ముడుపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, పవన్‌ ఎంతకు అమ్ముడుపోయాఏ ప్రజలకు చెప్పాలని టీడీపీ వర్ల రామయ్య అన్నారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ విపక్ష నేతలు జగన్‌, పవన్‌ కళ్యాణ్‌పై  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్‌ వీరుడు పవన్‌కళ్యాణ్‌ అవిశ్వాసం తీర్మానంపై లోక్‌సభలో చర్చ పూర్తవకుండానే ట్వీట్లు పెట్టారని విమర్శించారు. బీజేపీకి ఎంతకు అమ్ముడు పోయావు పవన్‌.. దమ్ముంటే నిజం చెప్పు అంటూ సవాల్‌ విసిరారు. అవిశ్వాస తీర్మానం నుంచి పారిపోయిన పిరికివాడు జగన్‌ అని వర్ల వ్యాఖ్యానించారు. మోదీని నిలదీయాల్సి వస్తుందనే వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించారని ఆరోపించారు. జగన్‌ లాంటి పనికిమాలిన నాయకుడు ప్రజలకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. చిల్లర నాయకుడు పవన్‌, దొంగల నాయకుడు జగన్‌ అంటూ వర్ల రామయ్య  విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇచ్చిన మాటను తప్పి రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే ప్రశ్నించాల్సింది పోయి కేంద్రాన్ని నిలదీస్తున్న చంద్రబాబుపై వీరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్‌ సాక్షిగా తెదేపా ఎంపీలు మోదీని నిలదీశారని, మోదీ విధానాలను నేరుగా సభలో వెల్లడించారన్నారు. కానీ జగన్‌, పవన్‌లు తమ పర్యటనల్లో ఒక్కసారైన మోడీని విమర్శించలేదని, దానిని బట్టి వీరు ఏ విధంగా బీజేపీతో ముందుకు సాగుతున్నారో అర్థమవుతుందన్నారు. పవన్‌, జగన్‌ల తీరును ప్రజలు గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెప్పటం ఖాయమన్నారు. ఇప్పటికైన పవన్‌, జగన్‌లు తీరుమార్చుకొని కేంద్రాన్ని, ప్రధాని మోదీని నిలదీయాలని అన్నారు.