పవన్‌ కళ్యాణ్‌కు భద్రత కల్పించండి

డిజిపిని కోరిన జనసేన నేతలు
గుంటూరు,మే23( జ‌నం సాక్షి): ఉత్తరాంధ్రలో పోరాటయాత్ర చేస్తున్న పవన్‌కల్యాణ్‌కు భద్రత కల్పించాలంటూ ఆ పార్టీ నేతలు ఏపీ డీజీపీ మాలకొండయ్యను కోరారు. పవన్‌ పర్యటనలో మంగళవారం రాత్రి జరిగిన అపశృతి దృష్ట్యా వారు డిజిపిని కలిశారు. దీనికితోడు పవన్‌ యాత్రకు పెద్ద ఎత్తున జనాలు కూడా తరలివస్తున్నారు. దీంతో మంగళగిరిలో పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీని కలిసిన నేతలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పవన్‌ యాత్ర, బస చేసే ప్రాంతాల్లో కనీసం 30 మంది పోలీసులతో భద్రత కల్పించాలని పార్టీ కోశాధికారి మర్రి రాఘవయ్య, సీనియర్‌ నేత గ్దదె తిరుపతిరావు కోరారు. పవన్‌కు భద్రత కల్పిస్తున్న పోలీసులు సివిల్‌ డ్రెస్‌ ధరిస్తున్నారని.. దీనివల్ల కొంత ఇబ్బంది కలుగుతోందని డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. పవన్‌కు కేటాయించే పోలీసులు యూనిఫామ్‌లో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. దీనిపై డీజీపీ స్పందిస్తూ.. ఆయా జిల్లాల ఎస్పీలతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తమకు హావిూ ఇచ్చినట్లు పార్టీ నేతలు చెప్పారు.
—–