పశ్చిమ బెంగాల్‌లో దారుణం

కోల్‌కతా(జ‌నం సాక్షి) : పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. నిద్రలో ఉన్న ఓ మహిళపై గత అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ  ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 ప్రగానాస్‌లో జయంతి అనే వివాహిత తన చిన్న కొడుకు సమిరాన్‌తో కలిసి నిద్రిస్తుంది. అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై యాసిడ్‌తో దాడి చేశారు. ఆ దాటికి జయంతి గట్టిగా అరవడంతో మేల్కొన్న కుటంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.అయితే స్వల్ప గాయాలతో సమిరాన్‌ బయటపడగా.. తీవ్రంగా గాయపడ్డ జయంతి మృతి చెందింది. ఈ ఘటన జరిగిన సమయంలో మృతురాలి భర్త జయదేవ్‌ మండల్‌ ఇంట్లో లేడు. ఆమెను ఆసుపత్రికి తరలించిన అనంతరం ఇంటి పక్కన వారు అతనికి సమాచారం అందించారు. ఆయన ఫిర్యాదు మేరకు కుల్‌తులి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆమెపై ఎవరు యాసిడ్‌ దాడి చేసుంటారనే విషయం అంతు చిక్కడం లేదని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.